365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,అమరావతి, జూలై 29,2022: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి “వైఎస్సార్ కాపు నేస్తం” సొమ్మును శుక్రవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రతిపక్ష నేతలపై మండిపడ్డారు. పథకాల పేరుతో డబ్బులు దోచుకుంటు న్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించారు.

వైఎస్ఆర్సిపి ప్రభుత్వం డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) కింద పథకాలను అమలు చేస్తోందని, చంద్ర బాబునాయుడు మాత్రం డిపిటి (దోచుకోవడం, పంచుకోవడం తినికో) అమలు చేశారని ఆరోపించారు. ప్రభుత్వం పరువు తీసేందుకు మీడియాలోని ఒక వర్గంతో పాటు బాంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను చంద్రబాబు నాయుడుకు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు జగన్.

హుద్ హుద్ తుపాను సమయంలో చేపట్టిన సహాయక చర్యలపై చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడంపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ.. గతంలో ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం తప్ప వరద బాధితులకు ఎలాంటి మేలు చేయలేదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాధితులందరినీ తమ ప్రభుత్వం ఆదుకున్నదని, రూ. 2000లతోపాటు నిత్యావసర వస్తువులు అందించామని చెప్పారు. అంతేకాకుండా సంక్షేమ పథకాలను పారదర్శకతతో అమలు చేస్తున్నామని ఎవరి పాలన కావాలో ప్రజలే తేల్చుకోవాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు.