365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా 31, డిసెంబర్ 2020 ః మహమ్మారి సమయంలో శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు మానసిక ఆరోగ్యమూ మెరుగుపరుచుకునేందుకు, ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా ఎంతగానో తోడ్పడిందని భారత ఆయుష్ శాఖామాత్యులు శ్రీపాద్ నాయక్ అన్నారు. కోవిడ్ కాలంలో చేపట్టిన కార్యక్రమాలతో పాటుగా 102 సంవత్సరాల పాటు ప్రజలకు సేవ చేయడంలో చూపిన అంకిత భావం పట్ల ద యోగా ఇనిస్టిట్యూట్ ను ఆయన ప్రశంసించారు.యోగా ఇనిస్టిట్యూట్ 102 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వర్ట్యువల్గా నిర్వహించిన వేడుకలలో ముఖ్యఅతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఆ వేడుకలలో భాగంగా నిస్పాండ మెడిటేషన్ యాప్ను లాంఛనంగా ఆవిష్కరించారాయన.ఈ సందర్భంగా మంత్రి నాయక్ మాట్లాడుతూ యోగా ఇనిస్టిట్యూట్ అంకితభావం, నిజాయితీ, సమగ్రత వంటివి యోగా సంప్రదాయాలను కాపాడటంలో ఎంతగానో సహాయపడటంతో పాటుగా అంతర్జాతీయంగా లక్షలాది మంది ప్రజల జీవితాలలోనూ మార్పు తీసుకువచ్చాయన్నారు. ప్రపంచశాంతికి యోగా ఇనిస్టిట్యూట్ ఎంతగానో తోడ్పాటునందించిందంటూ, ఈ ప్రపంచానికి ఇండియా అందించిన బహుమతి యోగా అన్నారు.కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలు, యోగా అసలైన విలువను తెలుసుకున్నారన్న మంత్రి, శారీరక ఆరోగ్యంతో పాటుగా మానసిక ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని సైతం పెంచుకోవడానికి యోగా దోహదం చేస్తుందన్నారు. ఈ సందర్భంలో యోగా ఇనిస్టిట్యూట్ చేపట్టిన కోవిడ్ కార్యక్రమాలను సైతం ఆయన ప్రశంసించారు.

యోగా ఇనిస్టిట్యూట్ ఆవిష్కరించిన మెడిటేషన్ యాప్ గురించి మాట్లాడుతూ ప్రపంచం ఆసక్తిగా వేచి చూస్తున్న యాప్ ఇదేనన్నారు. ఈ ప్రపంచం ధ్యానం కోసం అనుసరిస్తోన్న విధానాన్ని నిస్పాండ మార్చనుందని అభిప్రాయపడ్డారు.ద యోగా ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ హన్స జె యోగిందర్ మాట్లాడుతూ తమ ఇనిస్టిట్యూట్ 102వ వార్షికోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపారు. కోవిడ్ మహమ్మారి నుంచి ఉపశమనం కలిగించేందుకు తాము పలు కార్యక్రమాలను ఈ సంవత్సరం జోడించామంటూ యోగాను ప్రతి ఇంటికి చేరువచేయడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు.ఈ వేడుకలలో భాగంగా తరువాత దశాబ్దంలో భారతదేశపు ఆరోగ్యసంరక్షణ సవాళ్లు అనే అంశంపై ఓ చర్చా కార్యక్రమం సైతం నిర్వహించారు. ఈ చర్చలో డాక్టర్ హరీష్ శెట్టి (సైక్రియాట్రిస్ట్),డాక్టర్ శశాంక్ జోషి (ఎండోక్రినాలజిస్ట్), డాక్టర్ రవీంద్ర చిట్టల్ (పెడియాట్రిషియన్), డాక్టర్ ప్రద్యుమ్న మమోత్రా(ఆర్థోఽపెడిక్ సర్జన్), డాక్టర శేఖర్ అంబేద్కర్ (కార్డియాలజిస్ట్) పాల్గొన్నారు. ఈ చర్చకు మోడరేటర్గా హోలిస్టిక్ హెల్త్ గురు డాక్టర్ మిక్కీ మెహతా వ్యవహరించారు.