365 తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, బెంగళూరు,9 ఏప్రిల్ 2021:కేంద్ర మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ శాఖకు చెందిన పశు సంవర్ధక ,పాడి పరిశ్రమ విభాగం, ఆయుష్ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పరిశోధన, అభివృద్ధి దిశగా ఆయుర్వేదం, దాని అనుబంధ శాస్త్రాల విధానాలను ప్రోత్సహించేందుకు, పశువైద్యంలో ఆయా పద్ధతులను ప్రవేశపెట్టేలా ఈ ఎంవోయూ కుదిరింది. ఔషధ మూలికల ద్వారా పశు వైద్యంలో నాణ్యమైన ఔషధాల తయారీకి పరిశోధనలు చేయడం కూడా ఈ ఒప్పందంలో భాగం.

పశువుల ఆరోగ్యం, వాటి యజమానులు, సమాజానికి భారీ ప్రయోజనం కోసం వైశు వైద్య రంగంలో ఆయుర్వేద చికిత్సలను ఉపయోగించేందుకు ఒక నియంత్రణ యంత్రాంగం రూపొందడానికి ఈ ఎంవోయూ తోడ్పడుతుంది. శిక్షణ, పశు వైద్యంలో మూలిక ఔషధాల మార్కెటింగ్ అవకాశాలను అన్వేషించడం, ఔషధ మొక్కల పెంపకం, సంరక్షణ సహా చికిత్సల కోసం వాటిని అందించడం ద్వారా సంబంధిత రంగాల్లో సామర్థ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. మూలిక పశు వైద్య విద్య విధానాలు అభివృద్ధి చేయడానికి, పశు వైద్య మూలికల వినియోగం, ప్రాముఖ్యత, ఔషధ మొక్కల పెంపకంపై పాడి, వ్యవసాయ రైతుల్లో అవగాహన కల్పించడానికి ఈ ఎంవోయూ సాయపడుతుంది.