365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్,జూలై 9,2021:మత్స్యకారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నాలుగు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను లబ్దిదారులకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, ఎంఎల్ఏ ముఠా గోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా లతో కలిసి అందజేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ లోగో ను మంత్రి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగ అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాలను సామాజికంగా, ఆర్ధికంగా అత్యున్నతస్థాయిలో నిలిపాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యరంగ అభివృద్ధి కి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని కోరారు.
రాష్ట్రంలోని జలాశయాలు,చెరువులలో ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన చేపలకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం ద్వారా మత్స్యకారులు వాటిని వివిధ మార్గాల ద్వారా వినియోగదారులకు అమ్మినప్పుడు ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా తెలంగాణ మత్స్య సహకార సంఘాల లిమిటెడ్ రూపొందించిన లోగోను ఆవిష్కరించడం జరిగిందని చెప్పారు. వివిధ కారణాలతో మరణించిన 105 మత్స్యకారుల కుటుంబాలకు పెండింగ్ లో ఉన్న ఇన్సురెన్స్ 2 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగిందని, శనివారం బాధిత కుటుంబాలకు అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమంతో రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగిందని చెప్పారు. 2017 సంవత్సరంలో 1.65 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, గత సంవత్సరం 4.20 లక్షల టన్నులకు మత్స్య సంపద పెరిగిందని ఆయన అన్నారు. సంపద సృష్టించాలి…దానిని అర్హులైన పేదలకు పంచాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశం అని పేర్కొన్నారు. చేపలను ప్రజలకు చేరువ చేసేందుకు 60 శాతం సబ్సిడీ పై మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ఒక్కో వాహనం వలువ 10 లక్షల రూపాయలు కాగా ప్రభుత్వం 6 లక్షల రూపాయలను సబ్సిడీ చెల్లిస్తుండగా, లబ్దిదారులు 4 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. 150 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లను సిద్దం చేయగా, ఇప్పటికే 130 మొబైల్ ఫిష్ ఔట్ లెట్ వాహనాలను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన 20 వాహనాలను కూడా గంగపుత్ర, ముదిరాజ్ సంఘాల ప్రతినిధులు సూచించిన అర్హులైన లబ్దిదారులకు అందజేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
పరిశుభ్రమైన వాతావరణంలో వినియోగదారులకు చేపలను విక్రయించడానికి ఈ ఔట్ లెట్ లు ప్రారంభించడం జరిగిందని, వీటిని రానున్న రోజులలో 500 వరకు పెంచనున్నట్లు తెలిపారు. మత్సకారులు చేపల ను తక్కువ ధరలకు విక్రయించి ఆర్ధికంగా ఎంతో నష్టపోతున్నారని, దానిని దృష్టిలో పెట్టుకొని మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపలను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అంతేకాకుండా అన్ని జిల్లా కేంద్రాలు, మునిసిపాలిటీ లలో నాన్ వెజ్ మార్కెట్ లను నిర్మిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్ బ్రాండ్ తో తాజా చేపల అమ్మకం, చేపలతో వివిధ రకాల వంటకాల విక్రయాలు, అన్ని మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు. పట్టణాలు, అనంతరం పల్లెలకు తమకార్యకలాపాలు విస్తరించడం జరుగుతుందని పేర్కొన్నారు. దీని ద్వారా అన్ని మత్స్య సహకార సంఘాలు, సభ్యులు ప్రయోజనం పొందుతారని చెప్పారు. ప్రజలకు కూడా నాణ్యమైనఉత్పత్తులు సరసమైన ధరలకు లభిస్తాయని అన్నారు.