
365తెలుగు.కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుమల, 10 అక్టోబర్ 2021:
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీవారి ఆలయంలో పచ్చకర్పూరం, లవంగాలు, జొన్నకంకులు, యాలకులు, ముత్యాలు, తామర తులసి విత్తనాలు, పసుపు పవిత్రాలు, తామరపూల మాలలతో ప్రత్యేకంగా రూపొందించిన మాలలు, కిరీటాలతో స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదికపై ఆశీనులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి వేద మంత్రాల నడుమ కంకణభట్టార్ శ్రీ వాసుదేవ భట్టాచార్యులు ఈ కార్యక్రమం నిర్వహించారు.


దాదాపు రెండు గంటల పాటు జరిగిన స్నపన తిరుమంజనంలో వివిధ రకాల మాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు భక్తులను అనుగ్రహించారు. వేదపండితులు శ్రీసూక్తం, భూసూక్తం, పురుష సూక్తం, నీలా సూక్తం, నారాయణసూక్తాలను పఠిస్తుండగా అర్చకస్వాములు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేపట్టారు. శోభాయమానంగా సాగింది.