365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, ఆగస్టు 1,2022: జగన్ ప్రసంగాల్లో పస తగ్గిందా..? గతంలో ఆయన మాట్లాడితే పర్ఫెక్ట్ గా ఉండేది.. గతంలో పేలిన జగన్ మాటలతూటాలు ఇప్పుడు పేలవంగా సాగుతు న్నాయా..? అప్పటికీ, ఇప్పటికీ జగన్ రాజకీయ వ్యూహం మారిందా..? అసలు సడెన్ గా ఎందుకు మారింది..? రాజకీయాల్లో ఎదగాలంటే పక్కా వ్యూహం కావాలి.. పక్కా వ్యూహం ఒక్కటే సరిపోదు. నాయకుడి మాటలకు జనాలు చప్పట్లు కొట్టాలి.. చప్పట్లు కొట్టేలా మాట్లాడాలంటే ఖచ్చితంగా సరైన సబ్జెక్టు కావాలి.

ప్రజా సమస్యలు ప్రస్తావించే తీరు, వాటి మూలాలపై వ్యాఖ్యానించ డం, ఎదుటి పక్షంపై సహేతుకమైన విమర్శనాస్త్రాలు వంటివి ఉంటేనే ప్రజలు గుర్తిస్తారు. లేకుంటే కష్టమే. వ్యూహాలు మాత్రం అన్నివేళలా పనిచేయవు. చాలామంది నాయకులు వ్యూహాలు పన్ని చేతులు కాల్చుకున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ తన వ్యూహం మార్చుకున్నారు. అందులోభాగంగానే ఇప్పుడిప్పుడే జగన్ జిల్లాల పర్యటనలు మొదలు పెట్టారు. ఇన్నాళ్లూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బటన్ నొక్కిన ఆయన.. ఈ మధ్య కొత్తగా జిల్లాలకు వచ్చిమరీ జనాల మధ్యలోనే ప్రారంభోత్సవాల్లో పాల్గొంటున్నారు.

కొత్తగా ఓ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడానికో.. రోడ్డు ప్రారంభానికో రావడం లేదు. కేవలం మీట నొక్కేందుకు హంగూ ఆర్భాటలతో వస్తున్నారు. అంతేకాదు ఓ పక్క పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నారు. గతం కంటే ఆయన ప్రసంగాల్లో వ్యక్తిగత విమర్శలు కనిపిస్తున్నాయి. ఆయన స్పీచ్ అంతా ఒకే మాదిరిగా ఉంటుంది. తొలుత తాను ప్రారంభించిన పథకం గురించి చెప్పడం ప్రారంభించాక మిగతా పథకాల గురించి చెబుతారు. చంద్రబాబు, పవన్ ల గురించి ప్రస్తావిస్తున్నారు.
అంతేకాదు దుష్టచతుష్టయమంటూ పత్రికాధినేతలను ప్రస్తావిస్తూ తిట్ల దందండకం అందుకుంటున్నారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగిన సమావేశాల్లో అయితే సీఎం ఎప్పుడు ప్రసంగం ప్రారంభిస్తారా అని జనాలు ఎదురు చూసేవాళ్లు. ఇప్పుడు ఆయన ప్రసంగాల్లో పస తగ్గిందని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల జగన్ వ్యవహర శైలి అటు ప్రభుత్వవర్గాల్లోనూ.. అటు రాజకీయవర్గాల్లోనూ… సొంత పార్టీలోనూ చర్చనీయాంశంగా మారుతోంది. అభివృద్ధి విషయంలోనూ , పాలనలో విషయంలోనూ అన్నివర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పలువురు నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపాలన పట్ల అవగాహన ఉన్నవారికి ప్రభుత్వ తీరు ఏవిధంగా ఉందో అర్థం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈమధ్య ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత కూడా పెరుగుతోంది. విపత్తులో రెండువేల రూపాయలు ఇస్తే సరిపోతుందా..? ప్రజలకు నేరుగా భరోసా ఇవ్వక్కరలేదా..? అని అంటున్నాయి ప్రతిపక్షపార్టీలు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మాటలతూటాలు.. బాగా పేలేవి. అధికార పక్షంలో ఉన్నప్పటికీ జగన్ లో ఆ టెంపో కనిపించడంలేదని కొందరు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఐతే రానున్న ఎలక్షన్లలో భారీ విజయం సాధించాలని జగన్ ఇప్పటి నుంచే తన వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.