365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 7, 2025: హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈసారి ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’ రూపంలో కొలువుదీరనున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి చరిత్రలో మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపన 71వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, ఈ ఏడాది 69 అడుగుల భారీ ప్రతిమను ప్రతిష్ఠించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

విగ్రహ రూపకల్పన – విశ్వశాంతికి ప్రతీక..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి, యుద్ధాల కారణంగా ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతున్న నేపథ్యంలో, విశ్వశాంతిని కాంక్షిస్తూ ఈ ‘శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి’ని ప్రతిష్ఠిస్తున్నారు. స్వామి వారి కుడివైపున పూరి జగన్నాథుడు, ఎడమవైపున శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి విగ్రహాలను, ఉప మండపాల్లో కుడివైపు శ్రీ లక్ష్మి సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు శ్రీ గజ్జెలమ్మ దేవి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.

ఐదు పడగల ఆదిశేషుడి నీడలో, త్రిముఖుడై, అష్టభుజాలతో దర్శనమిచ్చే ఈ గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది. మూల విగ్రహం 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో, ఉప మండపాల్లోని విగ్రహాలు 18 అడుగుల వరకు ఉండేలా శిల్పి తీర్చిదిద్దుతున్నారు. శుక్రవారం సాయంత్రం విగ్రహ నమూనాను ఆవిష్కరించారు. ఈ ఏడాది ‘విశ్వ సనామ సంవత్సరం’ కావడం వల్ల, భక్తులు విశ్వాసంతో స్వామిని పదకొండు రోజుల పాటు సేవిస్తే, విఘ్నాలను తొలగించే గణపతి విశ్వశాంతిని ప్రసాదిస్తారని నిర్వాహకులు తెలిపారు.

కర్రపూజతో ఆరంభమైన ఉత్సవ పనులు..

Read This also…Khairatabad Ganesh This Year to Be ‘Sri Vishwashanti Mahashakti Ganapathi’..

Read This also…TransUnion CIBIL and Sa-Dhan Collaborate to Launch Nationwide Credit Awareness Program..

Read This also…NSE Sustainability Ratings and Analytics Ltd Launches ESG Ratings for Listed Companies.. 

ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ప్రతిష్ఠాపనకు ఆంకురార్పణగా శుక్రవారం సాయంత్రం కర్రపూజ క్రతువు శోభాయమానంగా జరిగింది. ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయా రెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి రాజ్కుమార్, మహేశ్ యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ కర్రపూజతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.