365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, విశాఖపట్నం, జూన్ 14, 2025:విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ (HBCHRC)లో అధునాతన క్యాన్సర్ కేర్ బ్లాక్కు ICICI బ్యాంక్, టాటా మెమోరియల్ సెంటర్ (TMC) సంయుక్తంగా శంకుస్థాపన చేశాయి.
నగరంలో క్యాన్సర్ చికిత్సా సేవలను విస్తరించే లక్ష్యంతో ICICI బ్యాంక్, TMCకి రూ. 550 కోట్ల నిధులను అందించేందుకు హామీ ఇచ్చింది. తూర్పు భారతదేశంలో శిశు,బ్లడ్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి అతిపెద్ద కేంద్రాలలో ఈ బ్లాక్ ఒకటిగా నిలవనుంది.
దాదాపు 3.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, అత్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మితం కానున్న ఈ ఎనిమిది అంతస్తుల ఐసీఐసీఐ ఫౌండేషన్ బ్లాక్ ఫర్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ నిర్మాణానికి ICICI బ్యాంక్ రూ. 550 కోట్లకు పైగా నిధులను సమకూరుస్తోంది. ఇది పూర్తిగా అందుబాటులోకి వచ్చాక ఏటా 3,000 మంది రోగులకు సేవలందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం విశాఖపట్నంలోని HBCHRC వార్షిక సామర్థ్యం 6,200 మంది రోగులుగా ఉంది.

ఈ కొత్త భవనంలో 215కు పైగా పడకలు ఉంటాయి. తూర్పు భారతదేశంలోనే అత్యుత్తమ స్పెషలైజ్డ్ క్యాన్సర్ చికిత్సా కేంద్రాల్లో ఒకటిగా ఇది రూపుదిద్దుకోనుంది. అన్ని అనుమతులకు లోబడి 2027 నాటికి దీని నిర్మాణం పూర్తవుతుందని అంచనా. ICICI బ్యాంక్ CSR విభాగమైన ICICI ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూసివ్ గ్రోత్ ఈ ప్రాజెక్టు అమలును పర్యవేక్షిస్తుంది.
ICICI బ్యాంక్ చైర్మన్ మిస్టర్ ప్రదీప్ కుమార్ సిన్హా, ICICI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ సందీప్ బాత్రా, టాటా మెమోరియల్ సెంటర్ (ముంబై) డైరెక్టర్ డాక్టర్ సుదీప్ గుప్తా సమక్షంలో కొత్త భవనం శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మిస్టర్ సిన్హా N.K. రావు ఆడిటోరియంను కూడా ప్రారంభించారు, దీని మౌలిక సదుపాయాలు, పరికరాలకు ICICI ఫౌండేషన్ సహాయం అందించింది.
ICICI బ్యాంక్ చైర్మన్ మిస్టర్ ప్రదీప్ కుమార్ సిన్హా మాట్లాడుతూ, “దేశీయంగా కీలక ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను పటిష్టపరచాలనే మా లక్ష్యానికి అనుగుణంగా క్యాన్సర్ కేర్ విషయంలో TMCతో చేతులు కలపడం మాకు గర్వకారణం. అవసరార్థులకు అత్యంత నాణ్యమైన వైద్య సంరక్షణను అందుబాటులోకి తేవాలనే మా నిబద్ధతకు ఈ ప్రాజెక్టు నిదర్శనంగా నిలుస్తుంది.
తూర్పు కారిడార్లో శిశు,రక్త క్యాన్సర్కి సంబంధించి అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సమీపాన ఉన్న తూర్పు రాష్ట్రాల్లోని రోగులకు సేవలందించేందుకు ఇది ఉపయోగపడుతుంది, పెరుగుతున్న క్యాన్సర్ చికిత్స అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది” అని తెలిపారు.
ICICI బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిస్టర్ సందీప్ బాత్రా మాట్లాడుతూ, “CSR కార్యకలాపాలకు సంబంధించి ఆరోగ్య సంరక్షణపై ICICI బ్యాంక్ ప్రత్యేక దృష్టి పెడుతుంది. విశాఖపట్నం, నవీ ముంబై, న్యూ చండీగఢ్లో కొత్తగా మూడు TMC కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 1,200 కోట్లు హామీనివ్వడం ద్వారా భారత్లో క్యాన్సర్ కేర్కి సంబంధించి విశిష్ట సేవలు అందిస్తున్న TMCతో రెండేళ్ల క్రితం జట్టు కట్టాం.
TMC తాజా అవసరాల దృష్ట్యా ఈ మొత్తాన్ని రూ. 1,800 కోట్లకు పెంచుతున్నట్లు తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. 10.7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ కొత్త బ్లాక్లలో అధునాతన వైద్య సదుపాయాలు, పరిశోధన విభాగాలు ఉంటాయి. ఈ బ్లాకుల్లో మొత్తం 19 LINACలు, 555 పడకలు ఉంటాయి. ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే, ప్రాంతీయ హబ్లుగా పని చేస్తాయి” అని పేర్కొన్నారు.
విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్టర్ డైరెక్టర్ డాక్టర్ ఉమేష్ మహంత్శెట్టి మాట్లాడుతూ, “ICICI ఫౌండేషన్ ఉదారతకు ధన్యవాదాలు. ప్రాంతీయంగా పీడియాట్రిక్, హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ల చికిత్స, పరిశోధన పురోగతికి ఇది గణనీయంగా దోహదపడుతుంది.
దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు అత్యుత్తమ చికిత్సను అందించేందుకు, మెరుగైన ఫలితాలను సాధించేందుకు మా సంస్థలు సమిష్టిగా చేస్తున్న కృషికి ICICI ఫౌండేషన్తో భాగస్వామ్యం నిదర్శనంగా నిలుస్తుంది” అని తెలిపారు.
ముంబైలోని టాటా మెమోరియల్ హాస్పిటల్ ప్రొఫెసర్ & హెడ్ డాక్టర్ గిరీశ్ చిన్నస్వామి మాట్లాడుతూ, “పీడియాట్రిక్ & హెమటోలింఫాయిడ్ క్యాన్సర్లకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, మదింపు, చికిత్స, అలాగే బ్లడ్ సెంటర్, పౌష్టికాహారం, పునరావాసంలాంటి సపోర్ట్ సర్వీసులు, నైపుణ్యాలపరంగా ప్రత్యేక సంరక్షణ అవసరమవుతుంది.
విశాఖపట్నంలోని HBCHRCలో గత మూడేళ్లుగా రోజూ కొత్తగా సుమారు 200 మంది పీడియాట్రిక్ క్యాన్సర్ రోగులు, 350-400 మంది హెమటోలింఫాయిడ్ క్యాన్సర్ రోగులు నమోదవుతున్నారు.
Read This also…Thrilling Finish at the 16th Monsoon Regatta 2025 as Top Youth Sailors Shine
Read This also…Monsoon Regatta 2025: Windless Day 5 Keeps Leaderboard Unchanged
ఎముక మూలుగు ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రాంతో పాటు ప్రస్తుత సర్వీసులను గణనీయంగా విస్తరించేందుకు, అలాగే ఇమ్యూనోథెరపీని కూడా ప్రారంభించేందుకు ఈ కొత్త బ్లాక్ సహాయకరంగా ఉంటుంది. ప్రాంతీయంగా రోగులకు సంబంధించి పరిశోధనలను చేపట్టేందుకు కూడా గణనీయంగా అవకాశం లభిస్తుంది” అని వివరించారు.

ICICI బ్యాంక్ అందించనున్న రూ. 1,800 కోట్ల విరాళంలో విశాఖపట్నం ఆసుపత్రికి అందించే రూ. 550 కోట్ల మొత్తం భాగంగా ఉంటుంది.
విశాఖపట్నంలోని ICICI ఫౌండేషన్ చైల్డ్ అండ్ బ్లడ్ క్యాన్సర్ బ్లాక్లో ఈ కింది సమగ్ర చికిత్స సేవలు అందుబాటులో ఉంటాయి:
- ఇంటెన్సివ్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అధునాతన రేడియేషన్ థెరపీ
- CAR-T సెల్ థెరపీ లాంటి అధునాతన ఇమ్యునోథెరపీలు
- మూడు LINACలు*, MRI మరియు CVT-PET స్కాన్లతో పాటు అత్యంత ఆధునిక మెడికల్ ఇమేజింగ్, డయాగ్నోస్టిక్స్
- 14 BMT (బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్) గదులు, 14 ICUలు, 5 ఆపరేటింగ్ థియేటర్లు
- పరిశోధనల కోసం ప్రయోగశాలలు, చికిత్స ప్లానింగ్, శిక్షణ కోసం జాయింట్ డిస్కషన్ కేంద్రాలు
లీనియర్ యాక్సిలరేటర్లు (LINACలు) రేడియేషన్ను పూర్తి కచ్చితత్వంతో కేవలం క్యాన్సర్ కణాలకే పరిమితం చేయడం ద్వారా వాటి పక్కన ఉండే ఆరోగ్యకరమైన టిష్యూలకు హాని కలగకుండా చూస్తాయి.