365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు17,2025 : టెక్నాలజీ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కొత్త పుంతలు తొక్కుతోంది. గూగుల్ తమ జెమిని అసిస్టెంట్‌ను మరింత పర్సనల్‌గా, వేగంగా పనిచేసేలా అప్‌డేట్ చేసింది. ఇకపై ఇది గతంలో యుజర్స్ జరిపిన సంభాషణలను గుర్తుంచుకుని, మరింత మెరుగైన సమాధానాలు ఇస్తుంది.

అలాగే, వినియోగదారుల ప్రైవసీని కాపాడేందుకు ‘టెంపరరీ చాట్స్’ అనే కొత్త ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. మరోవైపు, ఓపెన్‌ఏఐ తమ జీపీటీ-5 మోడల్‌పై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, దానిని మరింత ‘ఫ్రెండ్లీగా ఉండేలా’ మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ తప్పును తాము సరిదిద్దుకుంటామని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ స్వయంగా తెలిపారు.

మెటాపై విచారణ: చిన్నారుల సంభాషణలపై వివాదం..

ప్రముఖ టెక్ దిగ్గజం మెటా సంస్థ తీవ్ర విచారణను ఎదుర్కొంటోంది. ఆ సంస్థ అంతర్గత విధానాల ప్రకారం, ఏఐ చాట్‌బాట్‌లు చిన్నారులతో అభ్యంతరకరమైన సంభాషణలు జరపడానికి అనుమతించినట్లు కొన్ని పత్రాలు బయటపడ్డాయి. ఈ విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో మెటా వెంటనే ఆ విధానాన్ని ఉపసంహరించుకుంది.

భారత్‌లో సెమీకండక్టర్ విప్లవం: నాలుగు కొత్త ప్లాంట్లు..

భారత ప్రభుత్వం దేశీయంగా సెమీకండక్టర్ల తయారీని ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ మరో నాలుగు కొత్త సెమీకండక్టర్ ప్లాంట్లకు ఆమోదం తెలిపింది. దీంతో ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ కింద మొత్తం ప్రాజెక్టుల సంఖ్య పదికి చేరింది. ఇది దేశాన్ని సెమీకండక్టర్ల తయారీలో ఆత్మనిర్భర్ (స్వయం సమృద్ధి)గా మార్చడంలో ఒక ముఖ్యమైన అడుగు.

కొత్త గాడ్జెట్‌ల సందడి: యాపిల్, వివో, గూగుల్ నుంచి అంచనాలు..

రాబోయే రోజుల్లో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్‌లు, గాడ్జెట్‌లు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. యాపిల్ సంస్థ 2025 అండ్ 2026 మధ్య హోమ్‌పాడ్ మినీ, కొత్త యాపిల్ టీవీ, ఐప్యాడ్ మినీ అండ్ సెకండ్ జనరేషన్ విజన్ ప్రో వంటి వాటిని విడుదల చేయనున్నట్లు లీక్‌లు సూచిస్తున్నాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ల విషయానికి వస్తే, వివో తమ జీ3 5జీని విడుదల చేయగా, గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఎఫ్ఈ వంటి ఫోన్‌లపై కూడా అంచనాలు నెలకొన్నాయి.

మొబైల్ చెల్లింపులలో మార్పులు: యూపీఐలో మోసాలకు చెక్..

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 31 నుంచి అన్ని బ్యాంకులు, యూపీఐ యాప్‌లు పర్సన్-టు-పర్సన్ (P2P) పుల్ లావాదేవీలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.