365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్ ,మార్చి 8,2023:“ప్రతిసారి ప్రయత్నించి, ప్రతిసారి విఫలమయ్యారు, ఏమీ ఫర్వాలేదు, మరోసారి ప్రయత్నించండి, మరోసారి విఫలం కండి, మరింత మెరుగ్గా విఫలమవ్వండి” .
శామ్యూల్ బెకెట్ అనే ప్రఖ్యాత ఐరిష్ నాటకరచయిత ఈ ప్రఖ్యాతి చెందిన వాక్యాన్ని వ్రాసినప్పుడు, నిరంతరం కృషి చేయాలన్న, నిరాశ ఉండకూడదన్న గుణాన్ని ప్రేరేపించాలని భావించాడు.

మన దేశంలో రాజకీయ పార్టీలు ఈ మంత్రాన్ని గుడ్డిగా, ఎప్పుడూ అంతర్మథనం చేసుకోకుండా, గతంలో దారుణంగా విఫలమైపోయిన విధానాలను కూడా మరలా మరలా రూపొందించి ప్రతిపాదించాలన్న పట్టుదలతో తమలో ఐక్యం చేసుకున్నట్లు కనిపిస్తోంది. మద్యపాన నిషేధం, అటువంటి విధానాల్లో ఒకటి.

మహిళలకు భద్రత, నేరాలను నియంత్రించటం, నైతికతను స్థాపించటం అనే సద్గుణాలను కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఈ నిషేధాన్ని తెచ్చారు.
ఇప్పటివరకు, ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లో మద్యపాన నిషేధం ఘనమైన వైఫల్యంగానే నిలుస్తున్నదని చరిత్ర చెబుతోంది. మన రాజకీయనాయకులు, చరిత్రనుండి పాఠలు నేర్చుకోదలుచుకోలేదు.
కెనడా, నార్వే రష్యా, ఫిన్లాండ్, మెక్సికో వంటి ఎన్నో దేశాలు, మద్యపానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా చివరికి ఘనమైన సామాజిక , ఆర్ధిక ప్రయోగంలో భాగంగా 1920-1933 మధ్య కాలంలో 13 సంవత్సరాల పాటు మద్యపానాన్ని, మహదాశయాల దృష్ట్యా నిషేధించటమైనది.
ఇందువలన ఆ ఫెడరల్ ప్రభుత్వానికి 11 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం వాటిల్లింది, ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు 300 మిలియన్ డాలర్లను ఖర్చు చేయవలసి వచ్చింది. ఆర్ధిక అంశాలకు మించి, మద్యపాననిషేధం అమల్లో ఉన్న సమయంలో పోలీసుల్లో అవినీతి పెరిగి, నియంత్రిత నేరాల్లో పెరుగుదలకు దోహదం చేసింది. మద్యపాన దుర్వ్యసనం సమస్యను మరింత జటిలం చేసింది.
ఇక మన దేశం విషయానికి వస్తే, ఆర్ధిక నష్టాలు భారీగా ఉన్నట్లు, నేరాల రేటు గణనీయంగా పెరిగినట్లు, మద్యపానంలో చాలా తక్కువ తగ్గుదల ఉన్నట్లు గణాంకాలు భారీగా సూచిస్తున్నప్పటికీ, బీహారు ఇంకా మద్యపాననిషేధం కష్టాలను ఎదుర్కుంటూ ఉన్నది.

ఆంధ్ర ప్రదేశ్లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మెజారిటీ ప్రభుత్వం మరోమారు మద్యపానాన్ని నిషేధించేందుకు సంసిద్ధం అవుతోంది. 1994 నుండి 1997 మధ్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలయ్యింది.
ఎన్.టి. రామా రావ్ మద్యపానాన్ని నిషేధించగా, రాష్ట్రం లోలోపలా, రాష్ట్ర సరిహద్దుల నుండి మద్యం అక్రమంగా వచ్చి చేరుతున్నందువలన ఈ నిషేధం అమలు వీలు కాదని, విజయవంతమూ కాదని పేర్కొంటూ ఎన్. చంద్రబాబు నాయుడు నిషేధాన్ని ఎత్తివేశారు.

22 సంవత్సరాల తర్వాత, తమ ప్రాథమిక ఎన్నికల వాగ్దానాల విషయంలో అన్ని విధాల సవ్యంగా కనిపిస్తున్న ఆంధ్ర కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన రాజకీయ ప్రత్యర్ధి అయిన శ్రీ నాయుడు ఒకప్పుడు ఉపసంహరించిన మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టవచ్చు.
విభజన జరిగిన నాటి నుండి ఆంధ్ర ప్రదేశ్ భారీ అప్పులతో సతమతమవుతోంది. ఇప్పుడు రాష్ట్రానికి రూ. 16,000 కోట్లకు పైగా రెవెన్యూ లోటు ఉంది. కాగా 24,205 కోట్ల రూపాయల ఆర్ధిక లోటు అంచనా వేయబడింది.
కేంద్రం నుండి ప్రత్యేక హోదాను పొందేందుకు కూడా రాష్ట్రం కృషి చేస్తోంది. గత ఆర్ధిక సంవత్సరంలో 7358 కోట్ల రూపాయల భారీ ఆదాయాన్ని ఆర్జించి పెట్టిన మద్యపానాన్ని నిషేధించినట్లయితే, రాష్ట్ర ఖజానా పరిస్థితి మరింత దిగజారుతుంది.
క్రిందటి ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ను విశ్లేషించి చూసినట్లయితే విద్య మరియు వ్యవసాయం పై బడ్జెట్ వ్యయం, 18 ఇతర రాష్ట్రాల సగటు కనీస స్థాయికన్నా తక్కువగా ఉన్నది. ఆరోగ్యం విషయంలో రాష్ట్రవ్యయం చాలా కొద్దిపాటి స్థాయిలో ఎక్కువగా ఉన్నది.
ఒకవేళ వైఎస్ఆర్ ప్రభుత్వం నిషేధాన్ని విధించాలని నిర్ణయించినట్లయితే, ఈ సామాజిక రంగాల వ్యయం భవిష్యత్తులో ఇంకా పడిపోయే అవకాశం ఉన్నది.
మద్యపాననిషేధం ప్రజలను మద్యం సమకూర్చుకోవటం, త్రాగటం నుండి ఏ మేరకు ఆపగలదో, మద్యపాన నిషేధం ఆ మేరకు విజయం సాధించగలదన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని, నిషేధ విధానాన్ని అమలు చేసేందుకు ముందుకు ఉరకటానికి ముందు బీహారులోని సామాజిక-ఆర్ధిక పరిస్థితిని రాష్ట్రం బాగా అధ్యయనం చేయవలసి ఉంటుంది.
బీహారులో ఇప్పటికే దొంగరవాణా వ్యవస్థ వేళ్ళూనుకుంది. 2016లో చట్టాన్ని అమలు చేసినప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు 6.5 లక్షల దాడులను నిర్వహించారు, 1.22 లక్షల మందిని అరెస్టు చేశారు.
మొత్తమం మీద 16.4 లక్షల లీటర్ల ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ను, 12.4 లక్షల లీటర్ల రకరకాల దేశీయ మద్యాన్ని స్వాధీనంలోకి తీసుకోవటం జరిగింది. 2016 నుండి ఇప్పటివరకు 88,000 ఎఫ్ఐఆర్లను నమోదు చేయటమైనది.
ఎనిమిది కేంద్ర కారాగారాలతో సహా రాష్ట్రంలో నెలకొని ఉన్న 57 కారాగాల్లో, 27 కారాగారాలు, పరిమితికి మించి 25,000 మంది ఖైదీలతో కిటకిటలా డుతున్నాయి.
నిజానికి ఈ కారాగారాల్లో 16,880 మంది ఖైదీలను బందీలుగా ఉంచగలుగుతారు. 2016 నుండి 6.5 లక్షలకు పైగా దాడులను నిర్వహించగా మొత్తం అరెస్టు చేసినవారి1.29 లక్షలకు చేరుకుంది.

ఒక వంక వనరుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్రం ఇందుకోసం భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తోంది. దీనికి అదనంగా ఈ రంగంతో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్న 35,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. 21 మద్యం తయారీ కర్మాగారాలు మరియు 5,500 రీటెయిల్ దుకాణాలు మూతబడ్డాయి.
మద్యపాన దుర్వ్యసనం కారణంగా తమ భర్తలు, కుమారులు నిరుద్యోగులుగా ఉంటున్నారని వాదించి మద్యపాననిషేధం కోసం డిమాండు చేసిన మహిళలు, నిషేధం విధించిన తర్వాత ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నట్లు త్వరలోనే తెలుసుకున్నారు.
పైగా, వారి భర్తలు ఇప్పటికీ మద్యాన్ని సులభంగా తెచ్చుకోగలగటం వారి కష్టాలను మరింతగా పెంచింది. తేడా ఏమిటంటే, ఇప్పుడు వారి భర్తలు, దొంగరవాణా మద్యం కోసం మరింత ఎక్కువ సొమ్మున చెల్లిస్తున్నారు.
దీనితో మంచి జీవితం కోసం ఆ గృహిణులు కష్టపడి దాచిన సొమ్ము స్వాహా అయిపోతోంది. భర్త ఖర్చును అదుపు చేసేందుకు ప్రయత్నిస్తే, అతను కల్తీసారా బారిన పడే ప్రమాదం ఉన్నదని, అది మరింత ప్రమాదకరం, ప్రాణాలకే ప్రమాదకరం అని ఆమె ఆందోళన చెందుతుంది.
ఒక క్రమబద్ధమైన, విశ్వసనీయమైన ప్రత్యామ్నాయ మార్గం ఏదీ లేకుండా, ఆదాయాన్ని భారీగా సంపాదించిపెట్టే కీలకమైన ఒక మార్గాన్ని మూసివేయటం రాష్ట్రానికి ఎంతో ప్రమాదకరం.
మిగిలిన అన్ని ప్రమాదావకాశాల్లాగానే, దీని లాభనష్టాలను కూడా జాగ్రత్తగా బేరీజు వేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా మద్యనిషేధం ఎటువంటి చెప్పుకోదగిన లాభాలను లేదా అసలు నిరూపించగలిగిన లాభాలను వేటినీ కలిగించలేదని పలుమార్లు రూఢి అయ్యింది.

అయినా సరే, రాజకీయవేత్తలు దాన్ని ఒక అద్భుతమైన సంస్కరణగా చూపుతూ, వారి జీవితాలను మెరుగుపరుచునేందుకు అవసరమైన ఒక మార్పుగా చూపుతూ అమాయకులైన ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే, ప్రపంచంతో నిమిత్తం లేకుండా మద్యనిషేధం అమలు చేయటం వల్ల ప్రయోజనం లేదని, రాష్ట్రం ముందు తనకు తాను సహాయం చేసుకుంటేనే, వారికి సహాయం చేయగలుగుతుందన్న చేదు నిజం మాత్రం, కొన్నేళ్ళ తర్వాతే వెలుగులోకి వస్తుంది.