365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, సెప్టెంబర్ 10,2025 : ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (PPAI) అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్ విద్యార్థులకు ప్రత్యేక సందేశం ఇచ్చారు.
“ఆత్మహత్యలు కాదు, ఆశలకు జీవం పోయండి” అంటూ ఆమె యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం, సెప్టెంబర్ 10న చిక్కడపల్లి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కాలేజీ హాస్టల్లో ఈ కార్యక్రమం జరిగింది.
లయన్స్ క్లబ్ 320ఎ, పీపీఏఐ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా, “చదువు ఆత్మహత్యలు” అనే అంశంపై విద్యార్థినులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు.

ఈ పోటీల్లో విద్యార్థులు చదువు ఒత్తిడి, ఫలితాల భయం, కుటుంబ, సామాజిక అంచనాల వంటి అంశాలను లోతుగా విశ్లేషించారు. విజేతలకు లియో చైర్ పర్సన్ జి.కృష్ణవేణి, క్లబ్ సెక్రటరీ జి.లక్ష్మీ, పీపీఏఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ల రఘు, డా.హిప్నో పద్మా కమలాకర్ బహుమతులను, వ్యక్తిత్వ వికాసం, కథల పుస్తకాలను అందజేశారు.
ప్రముఖుల ప్రసంగాలు..
డా. హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ, విద్యార్థులు తమను తాము ఇతరులతో పోల్చుకుని తక్కువగా అంచనా వేసుకోవద్దని సూచించారు. సమస్యలను పంచుకోవడానికి స్నేహితులు లేదా పెద్దలు లేకపోవడమే ఆత్మహత్యలకు ప్రధాన కారణమని ఆమె అన్నారు.
విద్యార్థులు తమ లక్ష్యాలను వాస్తవికంగా నిర్దేశించుకోవాలని, కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం, మద్దతు చాలా అవసరమని ఆమె నొక్కి చెప్పారు.
లియో చైర్ పర్సన్ జి.కృష్ణవేణి మాట్లాడుతూ, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. “మాట్లాడండి, పంచుకోండి, సహాయం పొందండి” అనే నినాదాన్ని విద్యార్థులతో ప్రమాణం చేయించారు.
పీపీఏఐ తెలంగాణ అధ్యక్షుడు సాగర్ల రఘు మాట్లాడుతూ, పాఠశాలలు, కళాశాలల్లో సైకలాజికల్ కౌన్సెలింగ్ సేవలు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని డిమాండ్ చేశారు. మార్కుల ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగా విద్యార్థులను అంచనా వేయాలని ఆయన తెలిపారు.
సత్కారం & సహాయం..
ఈ సంవత్సరానికి లియో చైర్ పర్సన్గా ఎన్నికైన జి.కృష్ణవేణిని విద్యార్థులు, జి.లక్ష్మీ, సాగర్ల రఘు, డా.హిప్నో పద్మా కమలాకర్ ఘనంగా సత్కరించారు. సమస్యలు ఉన్న విద్యార్థులు 9390044031 నెంబర్కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం చివరలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు.