
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 2021 జూన్ 18: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఈరోజు రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జరిగింది. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. జూన్ 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరుగనున్నాయి.ఈరోజు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణం చేపట్టారు.
జూన్ 19న ధ్వజారోహణం :

జూన్ 19వ తేదీ శనివారం ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో తిరుచ్చి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు.జూన్ 22న సాయంత్రం 4 నుండి 6.30 గంటల వరకు శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం ఏకాంతంగా నిర్వహిస్తారు. జూన్ 27న ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమెత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులతో పాటు శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం జరుగనుంది. అనంతరం ఉదయం 10 నుండి 10.15 గంటల వరకు ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా గంగాళంలో చక్రస్నానం చేపడతారు. రాత్రి 7 నుండి 7.30 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈఓ కస్తూరి బాయి, ఏఇఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ గోపాలకృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.