365తెలుగు డాట్ కామ్ ఆన్ న్యూస్,అక్టోబర్ 5,2023: భారత స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభపడ్డాయి. రెండు రోజుల వరుస పతనానికి తెరపడింది. క్రూడాయిల్‌ ధరలు తగ్గడం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఇండస్ట్రియల్‌ ఔట్‌పుట్ పెరగడం ఇందుకు దన్నుగా నిలిచింది.

ఆసియాలో హాంగ్‌సెంగ్‌, నిక్కీ, థాయ్‌సెట్‌ సూచీలు ఎగిశాయి. ఇక ఐరోపా మార్కెట్లన్నీ భారీగా లాభపడటం విశేషం. నేడు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 109, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 405 పాయింట్ల మేర పెరిగాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 2 పైసలు బలహీనపడి 83.24 వద్ద స్థిరపడింది.

క్రితం సెషన్లో 65,226 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,598 వద్ద మొదలైంది. 65,443 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,753 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 405 పాయింట్లు పెరిగి 65,631 వద్ద ముగిసింది.

బుధవారం 19,436 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,521 వద్ద ఓపెనైంది. 19,487 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,576 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 109 పాయింట్లు పెరిగి 19,545 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్‌ 249 పాయింట్ల లాభంతో 44,213 వద్ద ముగిసింది.

నిఫ్టీ 50 అడ్వాన్స్‌ డిక్లైన్‌ రేషియో 35:15గా ఉంది. బజాజ్‌ ఆటో (2.15%), ఎల్‌టీ (2.06%), ఎం అండ్‌ ఎం (1.76%), టైటాన్‌ (1.64%), టీసీఎస్‌ (1.48%) టాప్‌ గెయినర్స్‌. పవర్‌ గ్రిడ్‌ (1.21%), హిందాల్కో (0.49%), ఎన్టీపీసీ (0.40%), సిప్లా (0.1540%), నెస్లే ఇండియా (0.38%) టాప్‌ లాసర్స్‌.

రంగాల వారీగా చూస్తే మెటల్‌, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ పెరిగాయి.

బెంచ్‌మార్క్‌ నిఫ్టీ పెరుగుదలలో ఎల్‌టీ, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కీలకంగా నిలిచాయి. ఎల్‌టీ ఏకంగా 18 పాయింట్ల మేర కాంట్రిబ్యూట్‌ చేసింది.

బీఎస్‌ఈలో 2,277 స్టాక్స్‌ పెరిగాయి. 1387 తగ్గాయి. 121 యథాతథంగా ఉన్నాయి. నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ను పరిశీలిస్తే 19,640 వద్ద రెసిస్టెన్సీ, 19,500 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్ప కాలానికి ఎల్‌టీ, ఐచర్‌ మోటార్స్‌, ఐసీఐసీఐ బ్యాంకు, హావెల్స్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు.

రైట్స్‌కు బంగ్లాదేశ్‌ రైల్వే నుంచి భారీ ప్రాజెక్టు దక్కింది. ఈ ఆర్డరు విలువ 111 మిలియన్‌ డాలర్లు. ఛాలెట్‌ హోటల్స్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌, ఎల్‌టీ, పీసీబీఎల్‌, సఫారీ ఇండస్ట్రీస్‌, సుజ్లాన్‌ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి.

గేమ్‌ మార్కెటింగ్‌ ఏజెన్సీని దక్కించుకోవడంతో నజారా టెక్నాలజీస్‌ షేర్లు 6 శాతం పెరిగాయి. పీఎన్‌బీలో లాభాల స్వీకరణ కనిపించింది. 60 లక్షల షేర్ల బ్లాక్‌డీల్‌తో ఇన్ఫీబీమ్‌ షేర్లు 13 శాతం ఎగిశాయి.

ఇన్ఫోఎడ్జ్‌ షేర్లు 4 శాతం పెరిగాయి. ఆరు సెషన్లుగా ఎడిల్‌వీస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ షేర్లు పెరుగుతూనే ఉన్నాయి. వండర్‌ లా ఆల్‌టైమ్‌ హైకు చేరుకుంది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709