365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, జనవరి 11,2025: 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3-1 తేడాతో భారత్‌ను ఓడించింది. న్యూజిలాండ్ సిరీస్‌లో కూడా క్లీన్ స్వీప్‌ను ఎదుర్కొన్న భారత జట్టు టెస్టుల్లో ఇటీవల కాలంలో పేలవమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో, బీసీసీఐ కీలక సమీక్షా సమావేశం ఈరోజు ముంబైలో జరుగనుంది.

సమీక్షా సమావేశంలో ఎవరు పాల్గొంటారు..?

ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, తాత్కాలిక కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ హాజరవుతున్నారు. గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితులైనప్పటి నుంచి టీ20ల్లో భారత్ బాగా రాణించినప్పటికీ, ODIలు, టెస్టుల్లో జట్టు నిలకడగా ప్రదర్శన ఇవ్వలేకపోయింది.

భారత్ టెస్టుల్లో వరుస పరాజయాలు..

బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించిన భారత జట్టు, వరుసగా మూడో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుతుంది అనుకున్నప్పటికీ, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 0-3తో క్లీన్ స్వీప్ అవమానాన్ని ఎదుర్కొంది. తర్వాత, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా ఆస్ట్రేలియా భారత జట్టును మట్టికరిపించింది. పెర్త్ టెస్ట్ మినహా భారత జట్టుకు గెలుపు దొరకలేదు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాట్‌తో దారుణంగా విఫలమవడంతో జట్టు గెలవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది.

కోచ్ గౌతమ్ గంభీర్ పాత్రపై ప్రశ్నలు..

సిరీస్‌లో గంభీర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా సిడ్నీ పిచ్ పచ్చగా ఉండగా ఇద్దరు స్పిన్నర్లను ఆడించడం పెద్దగా విమర్శలకు గురైంది. అంతేకాకుండా, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై అసంతృప్తి వార్తలు కూడా వెలువడుతున్నాయి.

బీసీసీఐ అసంతృప్తి

భారత జట్టు టెస్టుల్లో వరుసగా పరాజయాలు ఎదుర్కొంటుండటంతో బీసీసీఐ అసంతృప్తిగా ఉంది. కోచ్ గంభీర్, సెలెక్టర్లకు ప్రదర్శనపై వివరణ ఇవ్వాలని బీసీసీఐ కోరుతోంది. అయితే, ఇంగ్లాండ్ పర్యటన, వచ్చే నెలలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి ఎటువంటి ప్రధాన మార్పులు చేపట్టే అవకాశాలు కనిపించడంలేదు.

భవిష్యత్తుపై చర్చ జరుగుతుందా..?

సమీక్షా సమావేశంలో భారత్ టెస్టు జట్టు భవిష్యత్తుపై చర్చించే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాలకు ఇప్పటికిప్పుడు ముప్పు లేకపోయినా, టెస్టుల్లో వారి పాత్రపై పునఃసమీక్ష జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ నెలలో కొత్త కార్యదర్శిగా సైకియా ఎన్నిక

జనవరి 12న జరిగే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (SGM) దేవ్‌జిత్ సైకియా బీసీసీఐ కార్యదర్శిగా, ప్రభ్‌తేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతారని తెలుస్తోంది. డిసెంబర్ 1న జై షా ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉన్నారు. ఈ సమావేశంలో ఐసీసీ చైర్మన్ జై షాను ప్రత్యేకంగా సత్కరించనున్నారు.