
365 తెలుగు.కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుపతి,జూన్ 11,2022: అప్పలాయ గుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి వారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు.

చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహా శ్రేయస్కరం. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, సూపరింటెండెంట్ శ్రీవాణి, కంకణభట్టార్ సూర్యకుమార్ ఆచార్యులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.