365తెలుగు డాట్ ఆన్ లైన్ న్యూస్, విజయవాడ, ఏప్రిల్ 28,2025:‘సానుకూల ఆలోచన, బలమైన అంకితభావమే విజయానికి పునాది. సినిమా నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన చిరంజీవి, నిరంతర కృషితో సినీ రంగంలో శిఖరాలను అధిరోహించారు. ఎన్టీఆర్ తర్వాత వచ్చిన ఖాళీని సద్వినియోగం చేసుకుని, మెగాస్టార్గా ఎదిగారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో గురువారం నిర్వహించిన డాక్టర్ శరణి రచించిన “మైండ్సెట్ షిఫ్ట్” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు.
చిరంజీవి గురించి ప్రత్యేకంగా చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ‘‘సామాజిక సేవకు ముందుకు వచ్చిన తొలి సినీనటుడు చిరంజీవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, బ్లడ్ బ్యాంక్ స్థాపనకు భూమి కేటాయించాలని చిరంజీవి అభ్యర్థించారు. సినిమా నటులు తమ విభాగం మించి ప్రజాసేవపై దృష్టి పెట్టడం అరుదు. అలాంటి మార్గాన్ని చూపిన ఘనత చిరంజీవిగారికే చెందుతుంది’’ అని పేర్కొన్నారు.

“సంకల్పమే విజయానికి మార్గం”
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, ‘‘డాక్టర్ శరణి రచించిన ‘మైండ్సెట్ షిఫ్ట్’ పుస్తకం ఎంతో మందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరు కష్టపడతారు. కానీ తెలివిగా, సరైన మనస్తత్వంతో పనిచేయడం వల్లే విజయాన్ని సులభతరం చేసుకోవచ్చు. చిన్నతనంలో నుంచీ నటనపై ఉన్న మక్కువే నా జీవనదారిని నిర్ణయించింది. విమర్శలు ఎదురైనా, నిరుత్సాహాలు వచ్చినా, సంకల్పబలంతో ముందుకుసాగాను’’ అన్నారు.
Also read this…Chandrababu Naidu Praises Chiranjeevi’s Rise in Telugu Cinema at Dr. Sharani’s Book Launch
Also read this…Get Ready for Laughter, Drama, and Twists: “Bromance” Streams Exclusively on Sony LIV from May 1st!
ఇది కూడా చదవండి…మే 1 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్కు వస్తున్న థ్రిల్, హాస్యంతో నిండిన మూవీ “బ్రొమాన్స్”
‘‘నిజమైన విజయానికి విలువలే ఆధారం’’
‘‘నటుడిగా కెరీర్ ప్రారంభం సమయంలో సహాయక పాత్రలు మాత్రమే వచ్చాయి. కానీ వాటినీ నిబద్ధతతో పోషించాను. స్థిరత్వం, పట్టుదల వల్లే ప్రేక్షకులు నన్ను గుర్తించారు. విజయం కేవలం కష్టంతో కాదు; నిజాయితీ, వ్యక్తిత్వం, వినయం ఉంటేనే శాశ్వత గౌరవం లభిస్తుంది. ఎంత ఎదిగినా విలువలను విస్మరించకూడదు’’ అని చిరంజీవి వివరించారు.
ఉగ్రదాడిపై చిరంజీవి విచారం
జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై చిరంజీవి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి దాడుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమరులయ్యారు.

బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు అభినందనలు. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అన్నారు. అనంతరం, దాడిలో మృతిచెందిన వారికి ఘన నివాళులు అర్పిస్తూ మౌనం పాటించారు.
కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.