365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 29, 2025: ‘మోంథా’ తుపాను (Cyclone Montha) ప్రభావంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి బుధవారం ఉన్నతాధికారులను ఆరా తీశారు. రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్‌తో సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే అప్రమత్తంగా ఉండాలని సీఎం అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రధాన ఆదేశాలు, సూచనలు..

వ్యవసాయ నష్టం నివారణ..ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్నందున, కళ్లాల్లో ఆరబోసిన ధాన్యానికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలోనూ వర్షానికి తడవకుండా ఏర్పాట్లు చేయాలి.

రైల్వే ప్రయాణికులకు సాయం.. మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, గుండ్రాతిమడుగు స్టేషన్లలో రైళ్లు నిలిచిపోవడం, పలు రైళ్లను దారి మళ్లించిన నేపథ్యంలో, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

సహాయక చర్యలు, సమన్వయం.. తుపాను ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్లు ఈ బృందాలకు తగిన మార్గదర్శకత్వం వహించాలి.

నీటిపారుదల వ్యవస్థ పర్యవేక్షణ..నీటిపారుదల శాఖ అధికారులు రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటిమట్టాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నీటి విడుదలకు సంబంధించి ముందుగానే క్షేత్ర స్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. పూర్తిగా నిండిన రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలి.

రహదారులు, భద్రత..వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలి. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లోలెవల్ బ్రిడ్జిలు, కాజ్‌వేల‌పై రాకపోకలు పూర్తిగా నిషేధించాలి. పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి.

ఆరోగ్యం, పారిశుద్ధ్యం..వాన నీరు నిల్వ ఉండి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున, నగర, పురపాలక, గ్రామ పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపట్టాలి. వైద్యారోగ్య శాఖ తగినన్ని మందులు, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం చోటుచేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో జాగ్రత్తలు వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రజల నుంచి వచ్చే వినతులకు తక్షణం స్పందించాలని సీఎం ఆదేశించారు.