365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, విజయవాడ,సెప్టెంబర్ 25, 2022: ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గమ్మ కొలువై ఉన్న ఇంద్రకీలాద్రి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ పది రోజుల్లో సుమారు 14 లక్షల మంది భక్తులు రావొచ్చని భావిస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
తొలిరోజు స్వర్ణ కవచాలంకృత అలంకరణలో మెరిసే కనకదుర్గాదేవి దర్శనం మాత్రం ఉదయం 9 గంటల తరువాతే కల్పిస్తారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకుని తొలి పూజలు చేయనున్నారు. ఉత్సవాల్లో రోజుకు 60 వేల మంది వరకు భక్తులు రావొచ్చని, అక్టోబర్ రెండో తేదీ అమ్మవారి జన్మ నక్షత్రం అయిన మూలానక్షత్రం రోజున రెండు లక్షల మందికిపైగా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సూచనల మేరకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఢిల్లీరావు, నగర పోలీసు కమిషనర్ కాంతిరాణా, దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఈఓ దర్భముళ్ళ భ్రమరాంబ, సుమారు పది శాఖల అధికారుల ప్రత్యక్షంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కృష్ణానదిలో వరద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నది స్నానాలను పూర్తిగా నిషేదించి ఘాట్ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.

వినాయక గుడి నుంచి టోల్గేటు ద్వారా ఓం మలుపు వరకు మూడు వరసలు, ఓం మలుపు వద్ద అదనంగా ఉచిత దర్శనానికి, వీఐపీలకు ఒక్కొక్క క్యూలైను చొప్పున మొత్తం ఐదు వరుసలు ఏర్పాటు చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు సీతమ్మవారి పాదాలు, పున్నమిఘాట్ వద్ద తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు. భక్తుల కోసం సుమారు 20 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో ఉంచుతున్నారు.
దర్శనానికి వచ్చే భక్తుల కోసం సర్వదర్శనంతోపాటు వంద, మూడు వందల రూపాయల టిక్కెట్లను, వీఐపీలకు ఐదు వందల రూపాయల టిక్కెట్లను ఆన్లైన్లో అప్పటికప్పుడు అందించే ఏర్పాట్లు చేశారు. దసరా ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి సోమవారం తెల్లవారు జామున మూడు గంటలకు సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, బాలబోగ నివేదన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శన అవకాశం కల్పిస్తారు.

చతుర్వేద పారాయణలు, మహావిద్య, సుందరకాండ, సప్తశతి, చండీనవాక్షరి, బాలమంత్రం, సూర్య నమస్కారాలు, లక్ష్మీగణపతి, శివపంచాక్షరీ, నవగ్రహ జపం, లలితా సహస్రనామ పారాణాయాలతో పాటు ప్రతిరోజు కుంకుమ పూజలు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం గతానికి భిన్నంగా ఆలయ ప్రాంగణం మొత్తం దేదీప్యమానమైన విద్యుత్తు దీపాలంకరణ, లేజర్షోలను ఏర్పాటు చేశారు. కృష్ణాతీరం వెంబడి ముందస్తుగా గత ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కాంతారాణా టాటా వెల్లడించారు.
సుమారు 4వేల మందితో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు 12 చోట్ల వాహనాలకు పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మోడల్ అతిథిగృహం వద్ద కమాండ్ కంట్రోల్రూం ఏర్పాటు చేశామని, 400 సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని ఆయన వెల్లడించారు.