365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ నెల్లూరు, 27, 2020: కొవిడ్ పాజిటివ్తో బాధపడుతున్న శేషమ్మ అనే 52 ఏళ్ల మహిళకు మెడికవర్ ఆసుపత్రి వైద్యులు సంక్లిష్టమైన గుండె వైద్య చికిత్స చేసి ఆమె ప్రాణాలు కాపాడారు. గుండెలోపల ఉన్న మూడు వాల్వులలో లీకేజి ఉండటంతో ఆమెకు ఏమాత్రం ఊపిరి అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమెకు చికిత్స చేయడానికి, ప్రమాదకర పరిస్థితి నుంచి బయటకు తీసుకువచ్చి, పూర్తిగా నయం చేయడానికి చాలా సమయం పట్టింది. కొవిడ్ మహమ్మారి తీవ్రంగా ఉన్న ఈ తరుణంలో ఊపిరి అందడం లేదంటే.. కరోనా వైరస్ వల్లే కావచ్చు. అందువల్ల, అన్నిరకాల ముందుజాగ్రత్తలు తీసుకుని, అవసరమైన పరీక్షలు చేసి పరిస్థితిని అంచనా వేశారు.

ఆమెకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో పాటు వైరల్ లోడ్ 3-4 స్థాయిలో ఉన్నట్లు తేలింది. అయినా, కార్డియోవాస్క్యులర్ థొరాసిక్ సర్జన్లు డాక్టర్ లోకేశ్ రావు, డాక్టర్ త్రిలోక్ల నేతృత్వంలోని ప్రత్యేక వైద్యనిపుణుల బృందం ఆమె ప్రాణాలు కాపాడేందుకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. ఈ పరిస్థితిపై మెడికవర్ ఆసుపత్రుల వైద్యులు డాక్టర్ లోకేశ్ రావు, డాక్టర్ త్రిలోక్ మాట్లాడుతూ, “ఎలాంటి పరిస్థితిలో అయినా రోగి ప్రాణాలు కాపాడటమే వైద్యుడికి అత్యంత ముఖ్యం. ఈ కేసు విషయంలో ప్రతికూలతలను అధిగమించాలని నిర్ణయించుకున్నాం. వాటివల్ల చాలా సమస్యలు వచ్చాయి. అయినా, పరిస్థితిని అంచనా వేసి, రోగిని సాధారణ స్థితికి తీసుకొచ్చాక ఆమె గుండెలోని రెండు వాల్వులను మార్చడానికి ఏకంగా 5 గంటల పాటు సుదీర్ఘంగా శస్త్రచికిత్స చేశాం. దాని తర్వాత ఎలాంటి సమస్య లేకుండా పూర్తిస్థాయిలో కోలుకునేందుకు ఆమెను కంటికి రెప్పలా కాపాడుకున్నాం” అని తెలిపారు. సాధారణంగా అయితే వాల్వుల సమస్య (మైట్రల్ వాల్వు, ఆర్టిక్ వాల్వు) ఉండి, కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన రోగులు మరణించే ప్రమాదం 90% వరకు ఉంటుంది. కానీ, రోగి మనోధైర్యంతో పాటు చికిత్సకు పక్కాగా ప్రణాళిక వేయడంతో.. ఆమె పూర్తిగా కోలుకున్నారు. కార్డియాక్ ఐసీయూలో ఆమెను పరిశీలనలో ఉంచిన తర్వాత ఐదు రోజుల్లో సాధారణ స్థితికి రావడంతో ఆమెను డిశ్ఛార్జి చేశారు.