365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 2,2025 : వడగాలులపై తెలంగాణ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2025: తెలంగాణ రాష్ట్రంలో తీవ్రమవుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ (HAP)-2025ను రూపొందించింది.

ఈ ప్లాన్‌ను రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం సచివాలయంలో విడుదల చేశారు. వడగాలుల కారణంగా మరణించినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాను రూ.50,000 నుంచి రూ.4 లక్షలకు పెంచారు.

సమగ్ర చర్యలతో హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్..

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం 2025 జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో, ప్రజల ఆరోగ్య రక్షణకు 12 శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ విపత్తుల నిర్వహణ శాఖ, IMD సంయుక్తంగా HAP-2025ను రూపొందించాయి. ప్రతి జిల్లాకు నోడల్ అధికారిని నియమించారు.

చలివేంద్రాలు, ఓఆర్ఎస్ సరఫరా..

రాష్ట్ర వ్యాప్తంగా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాల ఏర్పాటు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కొత్తగూడెం, మెదక్, కరీంనగర్ వంటి పట్టణాల్లో ఈ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. సీఎస్ఆర్ కింద వివిధ కంపెనీలు ఈ సౌకర్యాలను సమకూర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వడగాలుల ప్రభావిత మండలాలు..

తెలంగాణలోని 612 మండలాల్లో 588 మండలాలను వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. గత నెల 15న వడగాలులను రాష్ట్ర స్పెసిఫిక్ విపత్తుగా నోటిఫై చేశారు. వడదెబ్బ కారణంగా మరణాలు సంభవించిన సందర్భంలో, మానవతా దృక్పథంతో తక్షణ ఎక్స్‌గ్రేషియా అందించాలని మంత్రి ఆదేశించారు.