365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, నవంబర్24, 2022: “పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద– ఫ్రీ ఇన్నోవేషన్ టు ఇంపాక్ట్”పేరుతో మొట్టమొదటి అంతర్జాతీయ సదస్సును ఎస్జీపీ నిర్వహించేందుకు సిద్ధమైంది. హైదరాబాద్లోని ఐఐటీ క్యాంపస్లో జనవరి 21,22 తేదీల్లో మొట్టమొదటి సారిగా ఈ అంతర్జాతీయ సదస్సు జరుగనుంది.

ఈసదస్సుకు దాదాపు 400 మంది పరిశోధకులు, మెడికల్ డాక్టర్లు, ఆయుర్వేద ప్రాక్టీషనర్లు, ప్రభుత్వ అధికారులు, కార్పొరేట్ ప్రతినిధులతో కూడిన డెలిగేట్లు యుఎస్ఏ, రష్యా, యుకె, కెనడా, ఇండియా వంటి ఎనిమిది దేశాల నుంచి వచ్చి హైదరాబాద్ లో రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో పాల్గొననున్నారు.
ఇందులో చికిత్సకు మద్దతునందించే విస్తృత స్ధాయి శాస్త్రీయ పరిశోధనలు, స్టాటిస్టికల్ డాటా పాయింట్లు, పరిశోధనా నివేదికలు, ఆయుర్వేద మౌలిక సూత్రాలు వంటివి చర్చించనున్నారు. ఆరోగ్యపరంగా అసమానతలు తొలగించడానికి దేశం లక్ష్యంగా చేసుకున్న వేళ భారీ వైద్య మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ వినూత్న స్ధానంలో ఉంది.
ఈ సదస్సుతో ఇప్పుడు హైదరాబాద్ దేశపు ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా నిలువనుంది. వైద్య పర్యాటకానికి ప్రత్యామ్నాయ కేంద్రంగా నిలవడంతో పాటుగా ఈ వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అనుభవించాలనుకునే వారికి ప్రయోజనం కలిగిస్తుంది.
ఈ సదస్సుకు భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖ; యుకె ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ ఇండియన్ సైన్సెస్, రష్యన్ అకాడమీ ఆఫ్ నేచురల్ సైన్సెస్ వంటివి మద్దతు అందిస్తున్నాయి. తెలంగాణా వైద్యశాఖ మంత్రి హరీష్రావు ఈ సదస్సు ను ప్రారంభించనున్నారు.

సుప్రసిద్ధ వైద్యులు డాక్టర్ దేవి శెట్టి , డాక్టర్ నరేష్ ట్రెహాన్, డాక్టర్ బీఎం హెగ్డే, డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే వంటి వారు ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో యుకె పార్లమెంట్ సభ్యులు బాబ్ బ్లాక్మాన్, రష్యా పార్లమెంట్ సభ్యురాలు లుబాయ్ దుఖ్నానినా హాజరుకానున్నారు.
భారతదేశాన్ని ప్రపంచ ఆరోగ్య రాజధానిగా మలిచే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఎస్జీపీ వ్యవస్ధాపకులు, పాలీ సైంటిఫిక్ ఆయుర్వేద (పీఎస్ఏ) ఆవిష్కర్త డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి అన్నారు. పురాతన పరిజ్ఞానం, ఆధునిక శాస్త్రం మిళితం చేసి మెరుగైన ఫలితాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.