365తెలుగు డాట్ కామ్,ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 16,తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా విశేషమైన గజ వాహనంపై శ్రీ మహాలక్ష్మీ అలంకారంలో శ్రీ పద్మావతి అమ్మవారు దర్శనమిచ్చారు. ఆలయం వద్దగల వాహన మండపంలో రాత్రి 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారి వాహనసేవ ఏకాంతంగా జరిగింది.



శ్రీ పద్మావతి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనది గజ వాహనం. గజపటాన్ని ఆరోహణం చేయడంతోనే అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గజం ఐశ్వర్యసూచకం. అందుకే ”ఆగజాంతగం ఐశ్వర్యం” అని ఆర్యోక్తి. పాలసంద్రంలో ప్రభవించిన సిరులతల్లికి గజరాజులు భక్తితో అభిషేకించాయని వేదాంతదేశికులు శ్రీస్తుతి చేశారు. నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతమని చెబుతారు.