
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్, తిరుపతి,సెప్టెంబర్ 8, 2021: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 9 నుంచి 13వ తేదీ వరకు జరుగనున్న బాలాలయం కార్యక్రమానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి ఆలయంలో విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు ప్రారంభమవుతాయి. ఇందులో భాగంగా సాయంత్రం 5.30 గంటల నుంచి సేనాధిపతి వారిని విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించి మృత్సంగ్రహణం చేపట్టారు. ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం 9.30 నుంచి10.30 గంటల వరకు జరిగిన ఆచార్య రుత్విక్ వరణం కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ 100 కిలోల బంగారంతో ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఋత్వికులకు విధుల కేటాయింపునే ఆచార్య ఋత్విక్వరణం అంటారని చెప్పారు. ఈ సందర్భంగా ఋత్వికులకు వస్త్రసమర్పణ చేశామన్నారు. సెప్టెంబరు 9 నుండి 13వ తేదీ వరకు యాగశాలలో బాలాలయ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. సెప్టెంబరు 13న ఉదయం 9.40 నుంచి10 గంటల మధ్య తులా లగ్నంలో బాలాలయ సంప్రోక్షణం చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో రాజేంద్రుడు, విఎస్వో మనోహర్, ఆలయ ప్రధానార్చకులు పి.శ్రీనివాస దీక్షితులు, ఆగమ సలహాదారు వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఎఈవో ఎం.రవికుమార్రెడ్డి, సూపరింటెండెంట్ ఎ.నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఎ.కామరాజు తదితరులు పాల్గొన్నారు.