365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అమరావతి, మే 24, 2025 : ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా, తెలుగు సినిమా సంఘాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలవకపోవడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
సినిమా రంగం అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ, సినీ ప్రముఖుల నుంచి కనీస కృతజ్ఞత కనిపించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ ఛీత్కారాలను మరిచారా?
గత ప్రభుత్వం సినీ పరిశ్రమను, అగ్ర నటులను ఎలా ఛీత్కరించిందో సినీ సంఘాలు మరచిపోయినట్లున్నాయని పవన్ కల్యాణ్ విమర్శించారు. థియేటర్ల వద్ద తహసీల్దార్లను నియమించి, నిర్మాతలకు ఇబ్బందులు కలిగించిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం మాత్రం వ్యక్తులను కాకుండా, పరిశ్రమ అభివృద్ధిని చూస్తుందని నాగార్జున కుటుంబ చిత్రాలకు సైతం మద్దతు ఇచ్చినట్లు తెలిపారు.

వ్యక్తిగత చర్చలు ఇకపై ఉండవు..
సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి టికెట్ ధరలు పెంచమని అడగడం సరికాదని, సినీ సంఘాలు సంఘటితంగా చర్చలకు రావాలని ఆయన సూచించారు.
దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు వంటి నిర్మాతలతో చర్చలు జరిగినప్పటికీ, సానుకూల స్పందన లేకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై వ్యక్తిగత విజ్ఞాపనలు లేకుండా, సంఘాల ప్రతినిధులతోనే చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.
సినీ రంగానికి ప్రత్యేక పాలసీ
సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని తీసుకురావాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు. సినీ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి కోసం శిబిరాలు, సెమినార్లు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Read This also…Alembic Pharmaceuticals Receives USFDA Final Approval for Amlodipine and Atorvastatin Tablets..
Read This also…MSME Credit Grows 13% YoY; Delinquencies Hit 5-Year Low..
తెలుగు సినీ రంగం నుంచి వచ్చిన “రిటర్న్ గిఫ్ట్”కు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.
థియేటర్లలో పన్ను, పారిశుధ్యంపై దృష్టి
థియేటర్ల నుంచి వచ్చే ఆదాయంపై పన్ను వసూళ్లను పరిశీలించాలని, రాయలసీమ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లలో పారిశుధ్యం, టికెట్ ధరలు, ఆహార ధరలపై పర్యవేక్షణ ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు.
మల్టీప్లెక్స్లు, సింగిల్ థియేటర్లలో టికెట్ ధరల వ్యత్యాసంపైనా ఆరా తీస్తామన్నారు. ప్రేక్షకుల ఫిర్యాదుల మేరకు థియేటర్లలో మెరుగైన సౌకర్యాల కోసం తనిఖీలు చేయనున్నట్లు వెల్లడించారు.