365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఫిబ్రవరి 10, 2023: హైసియా (హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) తన ప్రతిష్ఠాత్మక వార్షిక సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2023ని ఘనంగా నిర్వహించింది.
ఇందులో కాన్ఫరెన్స్, ప్రొడక్ట్ ఎక్స్ పో, వార్షిక పరిశ్రమ అవార్డులు ఉన్నాయి. ఈ ఏడాది ‘రీ-ఇమాజిన్, రీ-థింక్ అండ్ రీ బిల్డ్ ది ఫ్యూచర్’ అనే థీమ్ను ఈ కాన్ఫరెన్స్ తీసుకుంది.
ఈ సందర్భంగా అతిధులను స్వాగతిస్తూ హైసియా ప్రెసిడెంట్ మనీషా సాబూ మాట్లాడారు. “తెలంగాణ ఐటీ పరిశ్రమ ముందంజలో ఉందని భావిస్తున్నాం. ఈ సరైన సమయంలో, మనం పునరాలోచించాలి, పునఃసమీక్షించాలి, భవిష్యత్తును పునర్నిర్మించాలి.
వచ్చే 3 సంవత్సరాలలో భారతదేశంలో 2 మిలియన్ల ఐటీ ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఇందులో 30-40శాతం మాత్రమే సాంప్రదాయ ఐటీ సేవల సంస్థల నుంచి ఉంటాయి. మిగిలినవి జీసీసీ, స్టార్టప్ ల నుంచి ఉంటాయి” అని ఆమె చెప్పారు.
ఈ అపారమైన వృద్ధి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకు నేందుకు తెలంగాణను సిద్ధం చేసే దిశగా ఈ సదస్సు ఒక ముందడుగు. భవిష్యత్ వ్యాపార వృద్ధికి స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ చోదకశక్తిగా నిలుస్తాయని హైసియా అభిప్రాయపడింది.
కాబట్టి వచ్చే ఏడాదిలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఇన్నోవేషన్, స్టార్టప్ లను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి హైసియా ప్రణాళికలు రూపొందిస్తుందని ఆమె వివరించారు.
హైసియా తన ప్రతిష్ఠాత్మకమైన జీవన సాఫల్య అవార్డును ఆర్.చంద్రశేఖర్కు ప్రదానం చేసింది. ఆయన ఐఏఎస్ (రిటైర్డ్), సెంటర్ ఫర్ ది డిజిటల్ ఫ్యూచర్ చైర్మన్, నాస్కామ్ మాజీ అధ్యక్షుడు, టెలికాం కమిషన్ మాజీ చైర్మన్,
భారత టెలికమ్యూనికేషన్ విభాగం కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ మాజీ కార్యదర్శి. భారత ఐటీ పరిశ్రమకు, ముఖ్యంగా హైదరాబాద్ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను ఈ అవార్డు అందించారు.