365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 7,2025 : అక్రమార్కులకు సింహస్వప్నంగా మారిన హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హైడ్రా)కి ఇకపై సొంత పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. బుద్ధభవన్ పక్కనే హైడ్రా కార్యాలయంలోనే ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు (గురువారం) లాంఛనంగా ప్రారంభించనున్నారు.

డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్‌ఎఫ్), ఫైర్ సర్వీసెస్ విభాగాల తరహాలోనే సొంత పోలీస్ స్టేషన్ ఉండటంతో హైడ్రా తన కార్యకలాపాలను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా నిర్వహించనుంది. ఈ పోలీస్ స్టేషన్‌కు ఏసీపీ పి. తిరుమల్‌ను స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌వో)గా నియమించారు.

ప్రస్తుతం ఈ స్టేషన్‌లో ఆరుగురు ఇన్‌స్పెక్టర్లు, 12 మంది ఎస్సైలు, 30 మంది కానిస్టేబుల్స్ విధులు నిర్వహించనున్నారు. జీ ప్లస్ 2 అంతస్తుల్లో నిర్మించిన ఈ పోలీస్ స్టేషన్ దాదాపు 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులోకి వచ్చింది.

హైడ్రా పోలీస్ స్టేషన్‌లోనే విచారణ:

ఇకపై ప్రభుత్వ భూములు, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలు, పార్కులు, రహదారులు, చెరువులు, నాలాలను ఆక్రమించిన వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్‌లోనే క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చేపడతారు. ఈ పోలీస్ స్టేషన్‌కు సంక్రమించిన అధికారాల మేరకు నేరస్తులను అరెస్టు చేసే అధికారం కూడా ఉంటుంది.

అంతేకాకుండా చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో మట్టి పోసిన వారిపైనా కేసులు నమోదు చేస్తారు. మట్టిని తరలించే వాహనదారులతో పాటు, అందుకు సంబంధించిన కాంట్రాక్టర్ ఏ నిర్మాణ సంస్థకు ఆ మట్టి సరఫరా అవుతుందో తెలుసుకొని వారిపైనా కేసులు నమోదు చేస్తారు. చెరువుల్లోకి మురుగునీటిని నేరుగా వదిలే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.

ఆక్రమణల సూత్రధారులెవరో తేల్చనున్నారు..

ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా తేలనుంది. పేదవారి పేరుతో గుడిసెలు వేయించి ఆ తర్వాత భూములు కాజేసే బడా వ్యక్తుల భరతం పట్టనున్నారు.

నకిలీ పత్రాలు సృష్టించి లేఅవుట్లను మాయం చేసే వారిని, ప్రభుత్వ భూములను కాజేయాలని చూసే వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారు. వాల్టా చట్టం, ఫైర్ చట్టాల ఉల్లంఘనులను నేరుగా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించి శిక్షలు అమలు చేస్తారు.

ఇది కూడా చదవండి…మహిళా సైనిక నాయకత్వంలో “ఆపరేషన్ సిందూర్” ..

ఇది కూడా చదవండి…గత ఎనిమిది సంవత్సరాలలో పాకిస్థాన్ దాడులు, భారత్ ప్రతిస్పందన..

ఇది కూడా చదవండి…ఆపరేషన్ సిందూర్ కు ముందు తర్వాత.. పాకిస్థాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు..

లేఅవుట్లలో రహదారులను, ప్రజావసరాల కోసం ఉద్దేశించిన స్థలాలను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అనుమతి లేని ప్రకటనల హోర్డింగ్‌ల యజమానులను నియంత్రిస్తారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటారు. అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకుంటారు.

సామాన్యులకు అండగా..

లేఅవుట్లలో కొన్ని ప్లాట్లు కొనుగోలు చేసి పక్కనే ఉన్న వారి ప్లాట్లను కలిపేసుకుని పాత లేఅవుట్లను మార్చిన వారిపై హైడ్రా పోలీస్ స్టేషన్ కఠినంగా వ్యవహరిస్తుంది. లేఅవుట్‌లో రహదారులు, పార్కులతో పాటు సామాన్యుల ప్లాట్లను కాజేసిన వారిని విచారించి వారికి న్యాయం జరిగేలా చూస్తుంది.

ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకొని బాధ్యులపై హైడ్రా చర్యలు తీసుకుంటుంది. హైడ్రా ఇప్పటికే వందల ఎకరాల భూములను, పలు చెరువులు, పార్కులు, నాలాలను కాపాడింది.

ఆయా ఆక్రమణలకు సంబంధించి వేర్వేరు పోలీస్ స్టేషన్లలో 50కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. ఇకపై ఆ కేసులన్నిటినీ హైడ్రా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయనున్నారు. సమస్య మూలాల్లోకి వెళ్లి ఆక్రమణదారులను సరైన ఆధారాలతో జైలుకు పంపడమే లక్ష్యంగా హైడ్రా పోలీస్ స్టేషన్ పనిచేస్తుంది.