365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుమలగిరి, జూన్ 21, 2025: తిరుమలగిరిలోని పల్లవి మోడల్ స్కూల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ సంగీత దినోత్సవంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘షుగర్ బోర్డ్’ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ‘ఆపరేషన్ సింధూర్’ విజయవంత మైనందుకు గుర్తుగా స్థానిక మాజీ సైనిక అధికారులను, సైనికులను పల్లవి మోడల్ స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు, యోగా అలియన్స్ USA నుంచి యోగా ఇన్స్ట్రక్టర్ ప్రతిభా అగర్వాల్, లెఫ్టినెంట్ కల్నల్ శ్రీనివాస్ వర్దన్, లోకేశ్వర్ రావుతో పాటు పలువురు సైనికాధికారులు అతిథులుగా పాల్గొన్నారు.
యోగా ప్రాముఖ్యతపై అవగాహన..

ఈ ఉదయం స్కూల్ విద్యార్థులతో యోగాసనాలు వేయించి, యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాలు, ప్రాముఖ్యతను అతిథులు వివరించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక చొరవతో యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని, భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు.
యోగా చేయడం వల్ల ఎన్నో అనారోగ్యాలు దూరమవుతాయని, శరీరం ఉల్లాసంగా ఉంటుందని, జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. విద్యార్థులందరూ ప్రతిరోజూ యోగ చేయాలని సూచించారు.
షుగర్ బోర్డ్ ప్రారంభం: విద్యార్థులకు ఆరోగ్య పాఠాలు..
అనంతరం నిర్వహించిన ‘షుగర్ బోర్డ్’ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్సీతో కలిసి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా. నిధా ఫాతిమా ప్రారంభించారు. సీబీఎస్ఈ, కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు విద్యార్థులలో అధిక షుగర్ కలిగిన కూల్ డ్రింక్స్, ఆహార పదార్థాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, చిప్స్ వంటి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల చిన్న వయస్సులోనే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని డా. ఫాతిమా హెచ్చరించారు.
వాటి వినియోగాన్ని తగ్గించాలని, ఏయే కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్లో ఎంత షుగర్ ఉంటుందో సూచించే బోర్డును ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు. షుగర్ తక్కువగా ఉన్న పదార్థాలను ఎంచుకోవాలని ఆమె సూచించారు.
Read This also…Viraatapalem Trailer Unveiled by Naveen Chandra
Read This also…Smt. Sudha Dev Ji Varma, First Lady of Telangana, Launches BBA Program at Mahila Dakshata Samiti Educational Institutions
సైనికులకు గౌరవ సత్కారం: దేశభక్తికి ప్రతీక..
‘ఆపరేషన్ సింధూర్’ విజయవంతమైన సందర్భంగా స్థానిక మాజీ సైనిక అధికారులు, ప్రస్తుత సైనికులను పల్లవి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయలక్ష్మి సాగర్ సత్కరించారు. దేశసేవలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులను గౌరవించుకోవడం మన కర్తవ్యమని ప్రిన్సిపల్ ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లెఫ్టినెంట్ కల్నల్ శ్రీనివాస్ వర్దన్, లోకేశ్వర్ రావు, ఇతర సైనికులు మాట్లాడుతూ.. విద్యార్థులు దేశ సేవలో పాలుపంచుకోవాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని దేశానికి సేవ చేయాలని సూచించారు.

పల్లవి మోడల్ స్కూల్లో విద్యతో పాటు ఇలాంటి దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో సైనికుల పట్ల గౌరవం, దేశం పట్ల సేవా భావం పెరుగుతాయని సైనికులు స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్కు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. యోగా దినోత్సవం, మ్యూజిక్ డే సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.