Pawan-kalyan__

365తెలుగు డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్, వైజాగ్, అక్టోబర్ 15,2022: జనసేన పార్టీ భరోసా కార్యక్రమంతో పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శనివారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా జనసేనాని సైనికులు బ్రహ్మరధం పట్టారు.

విమానాశ్రయంలో ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు అధినేతను పుష్పగుచ్ఛాలతో సత్కరించగా, వీర మహిళలు హారతులు పట్టి ఆహ్వానించారు. భారీ స్థాయిలో విమానాశ్రయానికి జనసైనికులు రాకతో మధ్యాహ్నానికే విమానాశ్రయం ఆవరణ కిక్కిరిసిపోయింది. విమానాశ్రయ లాంజ్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రావడానికే సుమారు అర గంటకుపైగా సమయంపట్టింది.

janasenani

అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా పవన్ కళ్యాణ్ బస చేయనున్న బీచ్ రోడ్డులోని నోవాటెల్ హోటల్ కు బయలుదేరారు. శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్, గడసాల అప్పారావు, డా. బొడ్డేపల్లి రఘు, శ్రీమతి పొలసపల్లి సరోజ తదితరులు జనసేనానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

స్పెషల్ ఎట్రాక్షన్..

Pawan-kalyan-tour

ఉత్తరాంధ్ర కళలకు ప్రతీకగా నిలిచే తప్పెటగుళ్లు, గిరిజన సంప్రదాయ థింసా నృత్యాలతోపాటు కోలాటం, డప్పు నృత్యాలతో పవన్ కళ్యాణ్ కు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. వేలాది మంది యువకులు పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెంట సాగారు. రోడ్లకు ఇరువైపులా జనసేన శ్రేణులు, ప్రజలు పూలవర్షం కురిపించారు. ఆడపడుచులు హారతులు పట్టారు. సాగర నగరం జనసేన నినాదాలతో హోరెత్తింది.