365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మార్చి 6, 2025: ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యుల కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా కె.నాగబాబు రేపు (శుక్రవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో, నామినేషన్ ప్రక్రియకు అవసరమైన అన్ని పత్రాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి.

అందులో భాగంగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ పది మంది శాసనసభ్యులు తమ సంతకాలు చేశారు. వీరిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ ఉన్నారు. జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ దాఖలు చేయనుండటంతో అటు జనసేన పార్టీ వర్గాల్లోనూ, ఇటు మెగా అభిమానుల్లోనూ ఉత్సాహం నెలకొంది.