365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుప‌తి,ఫిబ్ర‌వ‌రి 22,2022: శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం శ్రీనివాసుడు యోగనరసింహుని అలంకారంలో సింహ వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.

శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు మూడో రోజు ఉదయం దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం సింహ వాహనాన్ని అధిష్టిస్తారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకు, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. సింహ రూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతాలవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయులమై ఆధిపత్యంతో రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను సంహరించడంలో నేను, నా వాహనమైన సింహమూ సమాన ప్రయత్నంతో ఉంటామని సింహ వాహనం ద్వారా శ్రీవారు ప్రభోధిస్తున్నారు.

రాత్రి 7 నుంచి 8 గంటల వరకు ముత్యపుపందిరి వాహన సేవ జ‌రుగ‌నుంది.