365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,జనవరి 6,2026:వాషింగ్టన్, జనవరి 5,2026 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ పై ఓ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన తీర్పుతో ఫిర్యాదుదారు షాక్ అయ్యాడు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దిగ్గజం ‘ఓపెన్ ఏఐ’కి అమెరికా కోర్టులో అనుకూలంగా తీర్పు లభించింది. తమ చాట్బాట్ చాట్జీపీటీ (ChatGPT) తప్పుడు సమాచారాన్ని అందించిందని, దీనివల్ల తన పరువుకు భంగం కలిగిందంటూ ఓ రేడియో వ్యాఖ్యాత దాఖలు చేసిన పరువు నష్టం దావాను జార్జియా కోర్టు కొట్టివేసింది. ఏఐ ప్లాట్ఫామ్లు సృష్టించే ‘మతిభ్రమించిన’ (Hallucinations) సమాచారానికి సంబంధించి వెలువడిన తొలి ప్రధాన తీర్పుగా ఇది నిలిచింది.
అసలేం జరిగింది..?
మార్క్ వాల్టర్స్ అనే రేడియో వ్యాఖ్యాత, ఓపెన్ ఏఐ సంస్థపై పరువు నష్టం దావా వేశారు. ఓ జర్నలిస్ట్ ఒక కోర్టు కేసుకు సంబంధించి సమాచారాన్ని అడగగా.. చాట్జీపీటీ సదరు కేసుకు మార్క్ వాల్టర్స్కు సంబంధం ఉన్నట్లు, ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు తప్పుడు సమాధానం ఇచ్చింది. వాస్తవానికి ఆ కేసుకు ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. దీంతో తనను అప్రతిష్టపాలు చేసేలా చాట్జీపీటీ వ్యవహరించిందని ఆయన కోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి :డేటా సెంటర్ల భవిష్యత్తు కష్టమేనా..? పర్ప్లెక్సిటీ సీఈఓ అరవింద్ శ్రీనివాస్ సెన్సేషనల్ కామెంట్స్.. !
ఇదీ చదవండి :ఏఐ మ్యాజిక్.. ఏడాది కోడింగ్ ప్రాజెక్ట్ ను గంటలో పూర్తి చేసిన ‘క్లాడ్ కోడ్’..!
కోర్టు తీర్పులో..
కేసును విచారించిన జార్జియా రాష్ట్ర కోర్టు న్యాయమూర్తి ట్రేసీ కేసన్, ఓపెన్ ఏఐ వాదనలతో ఏకీభవిస్తూ కీలక తీర్పునిచ్చారు. చాట్జీపీటీ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉందని సంస్థ ఇప్పటికే వినియోగదారులను హెచ్చరించిందని కోర్టు గుర్తుచేసింది.
తప్పుడు సమాచారం ప్రచురించడంలో సంస్థకు ఎటువంటి దురుద్దేశం (Actual Malice) లేదని, కేవలం సాంకేతిక లోపాలను పరువు నష్టంగా పరిగణించలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
ఆ తప్పుడు సమాచారం కేవలం ఒక వ్యక్తి స్క్రీన్పై మాత్రమే కనిపించిందని, అది బహిరంగంగా ప్రచురితం కాకపోవడం వల్ల ఫిర్యాదుదారుడికి ఎటువంటి ప్రత్యక్ష నష్టం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది.
ఏఐ రంగంలో మైలురాయి..

ఏఐ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ తీర్పు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. భవిష్యత్తులో ఏఐ బాట్లు ఇచ్చే సమాచారానికి ఆయా కంపెనీలు ఎంతవరకు బాధ్యత వహించాలనే అంశంపై ఈ కేసు ఒక దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే వినియోగదారులు ఏఐ ఇచ్చే డేటాను గుడ్డిగా నమ్మకుండా సరిచూసుకోవాలని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి :గేమ్స్ లోనూ ఫిట్నెస్ మంత్రం.. సత్తా చాటిన రియల్ మాడ్రిడ్ టీమ్..
సిగరెట్లు, చుట్టా, బీడీ అలవాటు ఉన్నవాళ్లకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం మిగతా వారితో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ పొగతాగడం అనేది ఆరోగ్యానికి హానికరమని పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ప్రత్యేకంగా ముద్రించి ఉంటుంది.
అలాంటి హెచ్చరికలను సైతం పెద్దగా పట్టించుకోకుండా తమకు క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణం పొగాకు ఉత్పత్తులే అనడం సరికాదు. అదేవిధంగా చాట్ జీపీటీ కూడా తాను జెనరేట్ చేసే సమాచారంలో తప్పులు దొర్లే ప్రమాదం ఉంటుందని డిస్క్లై మర్ ఉంటుంది. కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది.
