365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, అక్టోబర్ 5,2025: మానసిక ఆరోగ్యంపై ప్రజలలో అవగాహన పెంచడానికి లయన్స్ క్లబ్ 320ఎ, ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ సంయుక్తంగా అక్టోబర్ 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ‘మానసిక ఆరోగ్య నవోత్సవాలు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.

ఈ నవోత్సవాల పోస్టర్‌ను సుందరయ్య పార్క్‌లో లయన్స్ క్లబ్ 320ఎ డిస్ట్రిక్ట్ గవర్నర్ డా.జి.మహేంద్ర కుమార్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ పి.రమేష్ చంద్రబాబు, లియో చైర్మన్ జి. కృష్ణ వేణి, సుందరయ్య పార్క్ వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి, డా.హిప్నో పద్మా కమలాకర్, కర్ణాటక వుమెన్ & చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ సుపర్‌వైజర్ డా. స్పందన తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా మానసిక సమస్యలు..

ఈ సందర్భంగా డా.జి.మహేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ… దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ మానసికంగా ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని, ప్రతి ఏడుగురిలో ఒకరికి ఈ సమస్య ఉందని తెలిపారు.

ముఖ్యంగా యువతలో ఆత్మహత్యలకు ప్రధాన కారణం మానసిక సమస్యలే అని ఆందోళన వ్యక్తం చేశారు. డా.హిప్నో కమలాకర్ కృషి వల్లే ఈ అంశంపై అవగాహన పెరుగుతోందని ఆయన కొనియాడారు.

ఇతరులతో పోల్చుకోవడం, పక్కవారి గుర్తింపు కోసం ఆశించడం వల్లే చాలామంది మానసిక అనారోగ్యం పాలవుతున్నారని, గాయపడిన మనసుకు ఓదార్పు అవసరమని అన్నారు.

12 అంశాలపై అవగాహన..

మెంటల్ హెల్త్ అవేర్‌నెస్ కోఆర్డినేటర్ డా.హిప్నో పద్మా కమలాకర్ మాట్లాడుతూ.. ఈ నవోత్సవాలలో భాగంగా మొత్తం 12 కీలక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. వీటిలో కొన్ని..

మహిళలు – చిట్‌చాట్

మగవారి మనసు సున్నితం

విద్యార్థులు – ఆత్మహత్యలు

చదువు – ఒత్తిడి

ఒంటరి వృద్ధులు – మానసిక ఆరోగ్యం

ఇంటి పని – ఆఫీస్ పని సమతుల్యం

గర్భిణీ స్త్రీలు – మానసిక ఆరోగ్యం ప్రభావం

ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, సమస్యలను గుర్తించి, పరిష్కార మార్గాలను సూచించడమే ప్రధాన లక్ష్యమని ఆమె తెలిపారు.

సీనియర్ సిటిజన్స్ డే వేడుకలు..

లయన్స్ క్లబ్ 320ఎ ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేదీన (నేడు) సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని ఏవీ కాలేజీలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. సీనియర్ సిటిజన్స్‌ కోసం ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు, కొత్త వారిని కలిసే కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.