365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ మే11,2025 : శ్రీ సత్యసాయి జిల్లా: పాకిస్థాన్ కాల్పుల విరమణ నాటకాలను ఎవరూ నమ్మవద్దని, ఆ దేశ దుశ్చర్యలకు ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
ఆపరేషన్ సింధూర్ లో వీర మరణం పొందిన అమర జవానుమురళీ నాయక్ భౌతికకాయానికి ఆదివారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా, గోరంట్ల మండలం, కళ్లితండాలో నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కాళ్ల బేరానికి వచ్చి కాల్పుల విరమణ ప్రకటించిన మూడు గంటల్లోనే పాకిస్థాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి తోక జాడించిందన్నారు. స్వయంగా పాక్ ఆర్మీ జనరల్ ఉగ్రవాదులను ప్రేరేపించి దేశంపై దాడి చేయించారని ఆరోపించారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో దేశానికి ముప్పు పొంచి ఉందని ఆయన హెచ్చరించారు.
“మన దేశం ఎప్పుడూ యుద్ధం కావాలని కోరుకోలేదు. పొరుగు దేశాల మీద యుద్ధాలు చేసిందీ లేదు. మనల్ని మనం సంరక్షించుకోవడానికి ఇప్పుడు యుద్ధం చేయక తప్పని పరిస్థితి. పాకిస్థానే ఈ పరిస్థితికి కారణం” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
పాక్ దుశ్చర్యలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గట్టి గుణపాఠం చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.
మురళీ నాయక్ వీర మరణం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమరవీరుడి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 50 లక్షలు, తన వ్యక్తిగత సాయంగా రూ. 25 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే, ఐదు ఎకరాల స్థలం, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

గత నెల 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ దాడి నేపథ్యంలోనే భారత సైన్యం పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఉద్రిక్తతల్లో అగ్నివీర్ గా 2022లో విధుల్లో చేరిన శ్రీ మురళీ నాయక్ అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చూపు లేకున్నా 94 మంది జీవితాలలో వెలుగులు నింపుతున్న మాతృమూర్తి..
This is also read..Essential Precautions to Take Before Laser Hair Removal
ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సత్యకుమార్ యాదవ్, సవిత, పార్లమెంటు సభ్యులు పార్థసారధి, శాసన సభ్యులు అరవ శ్రీధర్, దగ్గుబాటి ప్రసాద్, పల్లె సింధూరరెడ్డి, ఎం.ఎస్. రాజు, హౌడా ఛైర్మన్ టి.సి. వరుణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, పార్టీ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర, భవానీ రవికుమార్, పత్తి చంద్రశేఖర్, ఈశ్వర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.