
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, జూలై 21,2021: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా ఉదయం 9 నుంచి10 గంటల వరకు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ విఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రమణ్యస్వామి, శ్రీ చండికేశ్వరస్వామివార్ల ఉత్సవర్లకు పాలు, పెరుగు, తేనె, పసుపు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో స్నపనతిరుమంజనం చేపట్టారు. సాయంత్రం కలశపూజ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.