365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, అక్టోబర్ 26,2023: భారత స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా ఆరో సెషెన్లోనూ నష్టపోయాయి. ఇజ్రాయెల్‌ – హమాస్‌ యుద్ధంతో భౌగోళిక రాజకీయ అనిశ్చితి పెరుగుతోంది. ఫలితంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

యూఎస్‌ డాలర్‌కు డిమాండ్‌ విపరీతమవ్వడంతో అమెరికా బాండ్‌ యీల్డులు పెరుగుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు షేర్లు అమ్మడానికి ఇదే ప్రధాన కారణం.

సూచీలు ఇంతలా నష్టపోవడం ఏడు నెలల తర్వాత ఇదే తొలిసారి. నెగెటివ్‌ సెంటిమెంటు ప్రభలడం, ఇన్వెస్టర్లు అమ్మకాలకు పాల్పడటంతో నేడు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 900, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 265 పాయింట్ల మేర పతనమయ్యాయి.

మెటల్‌, ఆటో, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌ సహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. ఐరోపా, అమెరికా, ఆసియా మార్కెట్లు విలవిల్లాడు తున్నాయి. దక్షిణ కొరియా, జపాన్‌ సూచీలు రెండు శాతానికి పైగా నష్టపోగా ఉద్దీపనా చర్యలతో చైనా సూచీలు కోలుకున్నాయి.

క్రితం సెషన్లో 64,049 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 63,774 మొదలైంది. అప్పట్నుంచి క్రమంగా పతనమైంది. 63,092 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 900 పాయింట్ల నష్టంతో 63,148 వద్ద ముగిసింది.

19,027 వద్ద ఆరంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 18,837 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి కుంగింది. మేజర్‌గా సపోర్ట్‌ అయిన 19,000 కిందకు వచ్చింది. ఆఖరికి 264 పాయింట్ల నష్టంతో 18,857 వద్ద క్లోజైంది. ఇక బ్యాంకు నిఫ్టీ 551 పాయింట్లు ఎరుపెక్కి 42,280 వద్ద స్థిరపడింది.

నిఫ్టీ 50లో కేవలం నాలుగు కంపెనీలే లాభపడ్డాయి. 46 నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంకు, అదానీ పోర్ట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, పవర్‌ గ్రిడ్‌ టాప్‌ గెయినర్స్.

ఎం అండ్‌ ఎం, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, యూపీఎల్‌, నెస్లే ఇండియా టాప్ లాసర్స్‌. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఐటీ, మీడియా, ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు అత్యధికంగా నష్టపోయాయి.

నవంబర్‌ నెల నిఫ్టీ ఫ్యూచర్స్‌ ఛార్ట్‌ను పరిశీలిస్తే 19,100 వద్ద రెసిస్టెన్సీ, 18,900 వద్ద సపోర్ట్‌ ఉన్నాయి. 19,000 స్థాయి వద్ద కన్సాలిడేషన్‌ జరిగేంత వరకు మార్కెట్లో పాజిటివ్‌ సెంటిమెంటు రాకపోవచ్చు.

ఇన్వెస్టర్లు స్వల్ప కాలంలో ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పవర్, ప్రెస్టీజ్‌ కన్స్‌స్ట్రక్షన్‌, ఇర్‌క్కాన్‌ షేర్లను కొనుగోలు చేయొచ్చు. నిఫ్టీ పతనంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, రిలయన్స్‌, బజాజ్ ఫైనాన్స్‌దే ఎక్కువ కాంట్రిబ్యూషన్‌.

జిందాల్‌ సా ఫలితాలు విడుదలయ్యాయి. రెవెన్యూ 35.2 శాతం పెరిగి రూ.5466కోట్లుగా నమోదైంది. ఎబిటా పెరిగింది. జూబిలంట్‌ ఫుడవర్క్స్‌ ఫలితాలు నిరాశపరిచాయి. జర్మనీ స్మార్ట్‌ యూరప్‌ జీఎంబీహెచ్‌తో ఇన్ఫోసిస్‌ ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.

ఇండియన్ బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 23 శాతం ఎగిసి రూ.5740 కోట్లుగా ఉంది. నికర లాభం 62 శాతం పెరిగింది. క్యూ2 ఫలితాల తర్వాత ఏసియన్‌ పెయింట్స్ షేర్లు 3 శాతానికి పైగా నష్టపోయాయి. సోమనీ సిరామిక్స్‌ 15.18 శాతం వాటాకు సమానమైన షేర్లను బయ్‌ బ్యాక్‌ చేయనుంది.

  • మూర్తి నాయుడు పాదం
    నిఫ్ట్ మాస్టర్
    స్టాక్ మార్కెట్ అనలిస్ట్
    +91 988 555 9709.