365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్,అక్టోబర్ 14,2024: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో వ్యవసాయ, వెటర్నరీ, మరియు ఉద్యాన అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన కౌన్సిలింగ్ సోమవారం ప్రారంభమైంది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ఈ కౌన్సిలింగ్ను రిజిస్ట్రార్ డాక్టర్ పి రఘురామిరెడ్డి ప్రారంభించారు.

తెలంగాణ ఎఫ్సెట్-2024లో 369 ర్యాంకు పొందిన ఎం.స్ఫూర్తి రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో తొలి అడ్మిషన్ పొందింది. అలాగే, 431, 550 ర్యాంకు పొందిన వై.శేషపద్మిని, ఎస్. ధరణి కుమార్ కూడా రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాలలో బీవీఎస్సీ కోర్సులో సీటు పొందారు. అయితే, 732వ ర్యాంకు పొందిన మహమ్మద్ సోహెల్ వరంగల్ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సులో సీటు తీసుకున్నాడు.
వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన కోర్సులలో చేరడం వల్ల విద్యార్థులకు ఉన్న ఉపాధి అవకాశాలు, ఉన్నత విద్యా అవకాశాల గురించి ఆయా విశ్వవిద్యాలయాల అధికారులు ఈ సందర్భంగా వివరిస్తారు.

ఈ కార్యక్రమంలో వెటర్నరీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ గోపాల్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ జయశ్రీ, డీన్ ఆఫ్ కమ్యూనిటీ సైన్స్ డాక్టర్ విజయలక్ష్మి, ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి ఆధ్వర్యంలో ఈ తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది.