
365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి,జులై 13,2021: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవం మంగళవారం ప్రారంభమైంది. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు ఏకాంతంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.

సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వామివారిని పెద్దశేష వాహనంపై వేంచేపు చేసి ఆస్థానం నిర్వహిస్తారు. అదేవిధంగా రెండో రోజు బుధవారం హనుమంత వాహనంపై, మూడో రోజు గురువారం గరుడ వాహనంపై స్వామివారిని వేంచేపు చేసి ఏకాంతంగా ఆస్థానం నిర్వహిస్తారు.కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా ఆలయంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం, వాహన సేవలు, ఆస్థానం నిర్వహించారు.
