


365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి, 11 ఏప్రిల్, 2022: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపంలో స్వామి, అమ్మవారిని ఆశీనులను చేసి అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణఘట్టాన్ని నిర్వహించారు.


సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం కన్నులపండుగగా ప్రారంభమైం ది. టిటిడి వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఆగమ పండితులు శ్రీ సీతారామాచార్యులు ఆధ్వర్యంలో కల్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.ముందుగా పుణ్యాహవచనం, సద్యో అంకురార్పణ, రక్షాబంధన, విశేషారాధన చేశారు. ఆ తరువాత రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, మధుపర్కం, కన్యాదానం, మహాసంకల్పం, స్వామి, అమ్మవారికి ప్రవరలు, మాంగళ్యపూజ చేపట్టారు. అనంతరం మాంగళ్యధారణ, ఉక్తహోమాలు, పూర్ణాహుతి, నివేదన, అక్షతారోహణం, హారతి ఇచ్చారు.


కల్యాణం అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డా.శిరీష, ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో పార్వతి, డిఎఫ్ఓ శ్రీనివాసులురెడ్డి, ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఏఈవో దుర్గరాజు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు మునిరత్నం, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు.
