365తెలుగు డాట్ కామ్ ఆన్ లైనర్ న్యూస్,హైదరాబాద్,సెప్టెంబర్ 29,2023 : హైదరాబాద్‌లో గణేష్ విగ్రహ నిమజ్జనోత్సవం సందర్భంగా జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందారు.

నివేదికల ప్రకారం, సంజీవయ్య పార్క్ సమీపంలో నిమజ్జనం కోసం విగ్రహాన్ని తరలిస్తున్న ట్రక్కు నుంచి పడి ఒక బాలుడు అక్కడికక్కడే మరణించాడు. మృతుడు కిషన్ బాగ్ ప్రాంతానికి చెందిన ప్రణీత్ కుమార్‌గా గుర్తించారు.

మరో సంఘటనలో,బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ సమీపంలో తన తండ్రి నడుపుతున్న ద్విచక్ర వాహనం నుంచి పడి అ వాహనం టైర్ చక్రాల కింద పడి నాలుగేళ్ల బాలుడు మరణించాడు. అతని తల్లిదండ్రులు, బెల్లంపల్లి వాసులు విగ్రహ నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

మూడో ఘటనలో ఇబ్రహీంపట్నం మండలం పోచారంలో చెర్లపటేల్‌గూడకు చెందిన స్నేహనాథ్ (14) గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపులో ట్రాక్టర్ ట్రాలీ ఢీకొని మృతి చెందాడు.

నాలుగో ఘటనలో శంకర్‌పల్లికి చెందిన నరసింహులు(50) విగ్రహ నిమజ్జనంలో పాల్గొంటుండగా ప్రమాదవశాత్తు చెరువులో మునిగి చనిపోయాడు. అతని మృతదేహాన్ని శుక్రవారం వెలికితీశారు.

గురువారం రాత్రి సికింద్రాబాద్‌లోని మహంకాళి దేవాలయం రోడ్డు సమీపంలో హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనోత్సవం చూసేందుకు న్యూబోవెన్‌పల్లికి చెందిన స్నేహితులు నందుకుమార్ (24), ధృవకుమార్ (22) అనే ఇద్దరు యువకులు బైక్‌ను ట్రక్కు ఢీకొనడంతో మృతి చెందారు. .

విడివిడిగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.