365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, ఏప్రిల్ 29, 2025 : భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు (ఏప్రిల్ 29, 2025) బుల్లిష్ ట్రెండ్తో ట్రేడింగ్ను కొనసాగిస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సూచీలు లాభాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి.
ఉదయం 10:30 గంటల సమయంలో సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 80,418.37 వద్ద, నిఫ్టీ 50 సూచీ 24,360 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
ఇది కూడా చదవండి…“సినీ ఇండస్ట్రీలో తెలియని టీమ్ రూపొందించిన టాలీవుడ్ అతి పెద్ద మ్యూజికల్ డ్రామా ‘నిలవే’ టీజర్ విడుదల”
Also read this…“Nilave: A Groundbreaking Telugu Musical Drama Unveils Soul-Stirring Teaser”
మార్కెట్లో ఉత్సాహం.. కీలక స్టాక్లు ర్యాలీకి బాసట..
గత ట్రేడింగ్ సెషన్లో సెన్సెక్స్ 1,006 పాయింట్లు (1.27%) లాభంతో 80,218.37 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 289.15 పాయింట్లు (1.20%) పెరిగి 24,328.50 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ వంటి హెవీవెయిట్ స్టాక్లు మార్కెట్ ర్యాలీకి ఊతమిచ్చాయి.
రిలయన్స్ షేర్లు మళ్లీ హైలైట్
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈ రోజు కూడా దూకుడు కనబరిచాయి. గత క్వార్టర్లో ఊహించిన దానికంటే బలమైన ఫలితాలతో షేర్లు 6% పైగా పెరిగి ఆరు నెలల గరిష్ట స్థాయి రూ.1,374.90కి చేరాయి. సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ స్టాక్లు కూడా లాభాలను నమోదు చేశాయి.
టాప్ గెయినర్స్, లూజర్స్ ఎవరు?
నిఫ్టీలో రిలయన్స్, బీఈఎల్, సన్ ఫార్మా, టాటా స్టీల్ టాప్ గెయినర్స్గా నిలిచాయి. అటు శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, అల్ట్రాటెక్ సిమెంట్, హిందుస్తాన్ యూనిలీవర్ స్టాక్లు నష్టాలను చవిచూశాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ సూచీ 1.2%, స్మాల్క్యాప్ సూచీ 0.5% లాభంతో ట్రేడవుతున్నాయి.
మార్కెట్ను నడిపిస్తున్న అంశాలు..
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, రిలయన్స్ వంటి కంపెనీల బలమైన ఆర్థిక ఫలితాలు, విదేశీ నిధుల ఇన్ఫ్లోలు మార్కెట్ను ఉత్సాహపరుస్తున్నాయి. అయితే, భారత్-పాకిస్థాన్ సరిహద్దు ఉద్రిక్తతలు, టారిఫ్లపై అనిశ్చితి ఇన్వెస్టర్లను కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి.
నిపుణుల సూచనలు..
మార్కెట్ విశ్లేషకుడు ఆనంద్ జేమ్స్ (జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్) మాట్లాడుతూ, “నిఫ్టీ 24,190 స్థాయిని కాపాడుకుంటే, త్వరలో 24,500-24,850 స్థాయిలు టార్గెట్గా మారవచ్చు” అని పేర్కొన్నారు. బలమైన ఫండమెంటల్స్ ఉన్న స్టాక్లపై దీర్ఘకాలిక పెట్టుబడులకు దృష్టి సారించాలని, అదే సమయంలో షార్ట్ టర్మ్ కరెక్షన్కు సిద్ధంగా ఉండాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు.

ఈ రోజు కీలక ఫలితాలు..
ఈ రోజు అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీరామ్ ఫైనాన్స్ వంటి కంపెనీల క్వార్టర్లీ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ దిశను మరింత ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
లాభాలతో ఊపందుకుంటున్నప్పటికీ..
స్టాక్ మార్కెట్ లాభాలతో ఊపందుకుంటున్నప్పటికీ, జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.