365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, అక్టోబర్ 11,2025: రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం (PJTSAU) క్యాంపస్లోని బొటానికల్ గార్డెన్ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించు కుంటోంది.
దాదాపు 46 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ గార్డెన్ గత 15 నుంచి 20 సంవత్సరాలుగా పూర్తి నిర్లక్ష్యానికి గురై, నిరుపయోగంగా మారింది.
చలనచిత్రాలకు నిలయం… పరిశోధనలకు వేదిక.. గతంలో, దాదాపు 50 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ బొటానికల్ గార్డెన్, ఎన్నో ప్రముఖ తెలుగు చలనచిత్రాల షూటింగ్లకు వేదికగా ఉండేది.
ప్రముఖ నటులు కమల్ హాసన్, సావిత్రి, వాణిశ్రీ, విజయశాంతి వంటి దిగ్గజాలు ఇక్కడ చిత్రీకరణలలో పాల్గొన్నారు. అంతేకాక, ఎంతో మంది పీజీ, పీహెచ్డీ విద్యార్థులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయడానికి ఇది నిలయంగా ఉండేది.
సీఎం ప్రారంభించిన కార్యక్రమం.. కార్పొరేట్ సంస్థల సహకారం:
దీని చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన ప్రస్తుత విశ్వ విద్యాలయ యాజమాన్యం, గత సంవత్సరం కాలంగా దీని పునరుద్ధరణకు నడుం బిగించింది. వనమహోత్సవంలో భాగంగా, సెప్టెంబర్ 7, 2025న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ గార్డెన్ నుంచే వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అదే రోజు హెచ్ఎండీఏ సహకారంతో సుమారు 3 ఎకరాలలో 1500 వివిధ రకాల అటవీ జాతి మొక్కలను నాటారు. CSR భాగస్వామ్యం: దీనికి కొనసాగింపుగా, విశ్వవిద్యాలయం ప్రముఖ స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్తో పాటు వివిధ కార్పొరేట్ సంస్థల సీఎస్ఆర్ (CSR) గ్రాంట్ల సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టింది.

10 ఎకరాలలో ఔషధ మొక్కలవనం..
ఈరోజు (అక్టోబర్ 11, 2025) బొటానికల్ గార్డెన్లో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీ ఆర్సీజీఎం సహకారంతో నిర్మాణ్ సంస్థ, విశ్వవిద్యాలయం కలిసి 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది వివిధ ఔషధ మొక్కల వనం ఏర్పాటులో భాగం.
ఈ కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి, రిజిస్ట్రార్, ఉన్నతాధికారులు, అగ్రోఫారెస్ట్రీ విభాగాధిపతి, ఆర్సీజీఎం ప్రతినిధులు మణిదీప, సుజిత, నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు మయూర్, తిరుపతి పాల్గొన్నారు. వర్సిటీ విద్యార్థులు, సిబ్బంది, ఆర్సీజీఎం వాలంటీర్లు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటారు. బొటానికల్ గార్డెన్ తిరిగి సందర్శకులకు, విద్యార్థులకు అందుబాటులోకి రానుంది.