365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, మే 2,2025: తెలంగాణ రాష్ట్రంలో వడగాలులు పెరిగిపోతున్నాయి. ప్రజలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్-2025ను రూపొందించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో ప్లాన్ను విడుదల చేశారు. వడదెబ్బ మరణాలకు ఎక్స్గ్రేషియాను రూ.50,000 నుంచి రూ.4 లక్షలకు పెంచారు.
ఎండల నుంచి రక్షణకు సూపర్ ప్లాన్..
భారతవాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో, జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని మంత్రి తెలిపారు. 12 శాఖలతో సమీక్ష నిర్వహించి, చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల సరఫరాకు ఆదేశించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి పట్టణాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
588 మండలాలు హై అలర్ట్లో..

రాష్ట్రంలో 612 మండలాల్లో 588ని వడగాలుల ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. వడగాలులను రాష్ట్ర విపత్తుగా ప్రకటించారు. మరణాల సందర్భంలో తక్షణ ఎక్స్గ్రేషియా అందించాలని మంత్రి ఆదేశించారు.
కార్మికులు, జంతువులకు రక్షణ..
కార్మికులకు రొటేషన్లో విశ్రాంతి, ఓఆర్ఎస్, త్రాగునీరు సరఫరా చేయనున్నారు. ఆసుపత్రుల్లో కూల్ వార్డులు, ఫైర్ సేఫ్టీ ఆడిట్లు నిర్వహిస్తారు. పక్షులు, వీధి జంతువులకు పార్కుల వద్ద నీటి సరఫరా చేయాలని సూచించారు.
అలర్ట్..
బస్టాండ్లు, మార్కెట్లలో షెల్టర్లు, త్రాగునీరు, ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా జాగ్రత్తల ప్రచారం చేయనున్నారు. సమాచార శాఖ, ఆరోగ్య శాఖ సమన్వయంతో ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. వడగాలుల నుంచి రక్షణకు అందరూ జాగ్రత్తలు పాటించాలని మంత్రి పిలుపునిచ్చారు.