365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్, జూన్ 30, 2025: రాడికల్స్‌కు ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపీ జెండా ఎగరేసిన నేత! విద్యార్థి దశలోనే అనేక పోరాటాలు, లాఠీ దెబ్బలు తిన్న నాయకుడు!

పేదలు, బీజేపీ కార్యకర్తల పక్షాన నిలబడిన న్యాయవాది! అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం, పార్టీ విధేయతకు మారుపేరు! హైకమాండ్ నిర్ణయం పట్ల సీనియర్ల హర్షం… పార్టీని నమ్ముకున్న వారికి అగ్ర తాంబూలం!

ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమాలకు పెట్టింది పేరు. తెలంగాణ ఉద్యమానికే కాదు… విద్యార్థి సంఘాల పోరాటాలకు పుట్టిల్లు ఈ గడ్డ. ఒకప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠగా సాగిన విద్యార్థి సంఘాల పోరాటాలు, వాటి నాయకుల ప్రభావం ఉస్మానియా ప్రత్యేకత.

ఆనాడు విద్యార్థి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తరువాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియాకు ఉంది.

ఈ నేపథ్యంలోనే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది ఎన్. రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అసలు ఎవరీ రామచంద్రరావు? బీజేపీ నాయకత్వం ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎందుకు ఎంపిక చేసిందనే అంశంపై పెద్ద ఎత్తున విశ్లేషణలు జరుగుతున్నాయి.

కొందరు ప్రత్యర్థులు రామచంద్రరావును డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో, ఆయన విద్యార్థి, రాజకీయ నేపథ్యంపై వాస్తవాలు మీ ముందుంచుతున్నాం.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నక్సలైట్లకు ఎదురొడ్డి…!

ఎన్. రామచంద్రరావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ ఆయన విద్యార్థి రాజకీయాల్లో ఒక సంచలనం. అందులోనూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఆ సంఘంలో చేరి బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు.

ప్రొఫెసర్ కుమారుడైన రామచంద్రరావు, బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారు. కానీ, రామచంద్రరావు ఏబీవీపీలో ఉంటూ విద్యార్థుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా, రాడికల్ విద్యార్థి సంఘాలతో నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి.

1975 నుండి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డాగా మారిన సమయం. రాడికల్స్ హవా నడుస్తున్న ఆ రోజుల్లో, వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రావు. ఉస్మానియా విశ్వవిద్యాలయ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి ఆయనపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్లు, చేతులు విరగ్గొట్టి వెళ్లారు.

దాదాపు రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తరువాత రాడికల్స్‌కు వ్యతిరేకంగా మరింత ఉధృతంగా పోరాటాలు చేశారు. విద్యార్థుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావు అటు రాడికల్స్‌తో పాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు.

ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎం.ఏ (1980–82), ఎల్‌.ఎల్‌.బీ (1982–85) పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా (1977–85), నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

న్యాయ కోవిదుడు..

1986లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన, జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్‌గా గుర్తించింది.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులు, ట్రిబ్యునల్స్‌లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండేవారు.

ప్రజా సమస్యలపై, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయపోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు.

రాజకీయ దురంధరుడు..

ప్రత్యక్ష రాజకీయాల విషయానికొస్తే… 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్‌లోని రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా (1980–82), నగర ఉపాధ్యక్షుడిగా (1986–90) పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్‌లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు.

లీగల్ సంయుక్త కన్వీనర్ (1999–2003), కన్వీనర్ (2003–06)గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ (2006–10), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (2007–09), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (2009–12), ముఖ్య అధికార ప్రతినిధిగా (2012–15) పనిచేశారు. 2015లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్‌గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

కలుపుగోలు మనిషి…పార్టీ విధేయుడు:

ఎన్. రామచంద్రావుకు పార్టీలో, బయట కలుపుగోలు మనిషిగా పేరుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత, కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం.

రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని, టెన్షన్ మటుమాయ మవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. విధేయతకు కేరాఫ్ అడ్రస్‌గా రామచంద్రరావు నిలుస్తారని, హైకమాండ్ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇన్ని సుగుణాలు, అపార రాజకీయ నేపథ్యం ఉన్నందునే పార్టీ జాతీయ నాయకత్వం రామచంద్రరావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైందని, దీనిని దృష్టిలో ఉంచుకునే పార్టీలోని సీనియర్ నేతలంతా ఆయనకు సంపూర్ణంగా మద్దతు పలికారని పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.