365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్ ,జనవరి 3,2023: భారత దేశ ప్రజలందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకోసమే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటయిందని, ఇది ఏ వొక్క రాష్ట్రం కోసమో పల్లె కోసమో కాదని, దేశం కోసమే బిఆర్ఎస్ (బీఆర్ఎస్ ఫర్ ఇండియా) అని బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి మాజీ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథి, టిజె ప్రకాశ్, కాపునాడు జాతీయ అధ్యక్షుడు రమేశ్ నాయుడు, శ్రీనివాస్ నాయుడు, రామారావు ఇతర కాపు సంఘం నాయకులు, కార్యకర్తలు సోమవారం తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు వారికి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్ ను కేసీఆర్ నియమించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
• మహోజ్వల భారతదేశ నిర్మాణం కోసమే బీఆర్ఎస్
• ప్రజల ఆలోచనా సరళిని మార్చి మహోజ్వల భారత దేశ నిర్మాణం కోసమే బిఆర్ఎస్.
• భారత దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్
• భారత దేశంలో సామూహిక లక్ష్యం ఏర్పాటుకే బీఆర్ఎస్
• దేశంలోని పాలనను వ్యక్తుల చుట్టూ కాకుండా వ్యవస్థీకృతం చేసేందుకే బీఆర్ఎస్.
• జాతి అభివృద్ధి కోసం తపనపడే టీం ను దేశవ్యాప్తంగా తయారు చేసేందుకే బీఆర్ఎస్.
• దేశంలోని సహజ వనరులను సద్వినియోగపరుచుకుని సంపద సృష్టించి దేశ ప్రజలకు పంచడం కోసమే బీఆర్ఎస్.
-నీటి యుద్ధాలను నివారించేందుకు బీఆర్ఎస్
• స్వార్థపూరిత రాజకీయాలను పారదోలడానికి, ఎన్నికల్లో రాజకీయ నాయకులనో పార్టీలనో కాకుండా ప్రజలను గెలిపించేందుకు వారి ఆకాంక్షలను కార్యరూపం ఇచ్చేందుకే బీఆర్ఎస్.
• స్వార్థ రాజకీయ ప్రయెజనాలకోసం మతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి విభజించే దుర్మార్గాలను పారదోలి ఉజ్వల భారతాన్ని నిర్మించడానికే బీఆర్ఎస్.
• రోటీన్ రాజకీయాలనుంచి గోల్ మాల్ వ్యవహారాలనుంచి దేశాన్ని బయటపడేసేందుకే బీఆర్ఎస్.
• కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పాలసీ ప్రయివేటైజేషన్ అయితే…..మా పాలసీ నేషనలైజేషన్…. ప్రయివేట్ చేసిన ప్రతిదాన్ని మీము అధికారంలోకి వస్తే తిరిగి తీసుకుని జాతీయం చేయడానికే బిఆర్ఎస్.
• ఇటువంటి బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే బిఆర్ఎస్

• కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు వెస్ట్రన్ గాట్స్ నుంచి ఈస్ట్రన్ గాట్స్ వరకు ఈ భావజాలాన్ని దేశంలోని ప్రతి పల్లెలో ప్రతి నియోజకవర్గానికి విస్తరింప చేయడానికే బిఆర్ఎస్
-ప్రపంచంలోనే ప్రబలమైన ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికే బిఆర్ఎస్
-భారత దేశాన్ని ప్రగతి ప్రస్థానంలో నడిపించేందుకే బిఆర్ఎస్.
-ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకూడా దేశ ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రార్థిస్తున్నాను.
-బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఏడాదికి లక్షా 45 వేల కోట్ల ఖర్చు చేసి రెండేండ్లలో దేశమంతా రైతులకు ఉచిత కరెంటిస్తం.
-తరతరాలుగా వివక్షకు గురైన దళిత బిడ్డలను తలెత్తుకొని గర్వంగా బ్రతికేలా చేసేందుకే బిఆర్ఎస్
– దేశ వ్యాప్తంగా ఉచిత కరెంటు, దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకే బీఆర్ఎస్
– ఏడాదికి రెండున్నర లక్షలతో దేశమంతా దళితబంధు ఇస్తం.
-ఇది దేశానికి పెద్ద సమస్యకాదు.
-డెబ్బయైదేండ్ల స్వతంత్ర భారతం ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా…ఏ దశకు చేరుకోవాలో ఆ దశకు చేరుకోలేదు. ప్రజల కోరిక, స్వాతంత్ర్య ఫలం పూర్తిగా సిద్ధించలేదు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసమే బీఆర్ఎస్.
-ఇవన్నీ మహోన్నత లక్ష్యాలతో ముందుకు పోతున్న బిఆర్ఎస్ లో పనిచేసే ప్రతి కార్యకర్తకూ నాయకునికీ భారత స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వారికి దిక్కిన గౌరవం చరిత్రలో దక్కుతుంది. ఈ గౌరవం కోసమే బిఆర్ఎస్.
– ఎన్నికల్లో ప్రజలను గెలిపించేందుకే బిఆర్ఎస్
• దేశ సమస్యల పరిష్కారమే పరమ లక్ష్యంగా ముందుకు సాగుదాం.
• సంక్రాంతి తర్వాత మరో 7,8 రాష్ట్రాల్లో మన పోరాటం ప్రారంభమౌతుంది.
• భవిష్యత్తులో చాలామందికి ఆశ్చర్యం కలిగించే చేరికలుంటాయి .
బిఆర్ఎస్ అధినేత ప్రసంగంలోని మరిన్ని అంశాలు :
• మన దేశంలో 50 శాతం భూమి సాగుకు అనుకూలంగా ఉంది. 83 కోట్ల ఎకరాల భూమి ఉంటే అందులో రమారమి 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. మన దేశంలో ప్రతి ఏడాది ఒక లక్షా 40 వేల టీఎంసీల వర్షం కురుస్తోంది. 70 వేల టీఎంసీల నీరు పుష్కలంగా ఉంది.
మనదేశంలో అన్ని రకాల విద్యుత్ కలిపితే దాదాపు 4 లక్షల 10 వేల 100 మెగావాట్లు స్థాపిత విద్యుత్ సామర్థ్యముంటుంది. ఇది సాక్షాత్తు కేంద్రం చెబుతున్న లెక్క. భూమి వున్నది, సూర్యరశ్మి పుష్కలంగా వుంది.
పర్యావరణ వాతావారణం వుంది, పని చేసేటటువంటి మనషులు ఉన్నారు. ఇన్నీ వున్న భారత దేశం ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ చైన్ కలిగివున్న దేశంగా వుండాలె..? మరి వున్నదా..?
•కానీ భారతదేశ రైతులు దేశంలో ఉద్యమాలు చేస్తున్నారు. లక్ష కోట్ల విలువైన పామాయిల్ ను మనం దిగుమతి చేసుకుంటున్నాం. సంపద ఉండి, అద్భుతమైన మానవ వనరులుండి మనం ఈ దుస్థితిలో ఎందుకున్నాం.
అదే సమయంలో….అమెరికా భూభాగంలో 29 శాతం మాత్రమే సాగు భూములు ఉన్నాయి. చైనాలో 16 శాతం మాత్రమే సాగు భూమి ఉంది. కానీ అవి అంతగా అభివృద్ధి చెందడంలో ఆయా దేశాలు చేస్తున్న కృషి ఏమిటి.? ప్రజా జీవితంలో ఉన్న ప్రతీ ఒక్కరు ఇది ఆలోచించాలి.
వనరులు, వసతులు ఉండి ఈ దేశ ప్రజలు ఎందుకు వంచించబడాలి? ఎందుకు శిక్షించబడాలి ? ఈ పరిస్థితి ఇలాగే ఉండాలా ? మార్పు రావాలా ?
• బిఆర్ఎస్ ఏదో తమాషా కోసం కాదు. బిఆర్ఎస్ ఫర్ ఇండియా. లక్ష కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. ఏ విషయాన్ని ప్రారంభించినా మొదట ఎదురయ్యేది అవహేళనే. మహాత్మాగాంధీ గారి లాంటి మహానుభావులు కూడా ఇదే చెప్పారు.
• కులాల కుంపట్లు, మత విద్వేషాలు రెచ్చగొట్టి ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలు చేయడమే కొన్ని రాజకీయ పార్టీల లక్ష్యమైంది.
• ఈ రోజు దేశంలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా?
• రైతాంగం ఢిల్లీలో ధర్నాలు చేశారు. వందలమంది చనిపోయారు. కానీ ఎవరూ పట్టించుకున్నవారు లేరు.
• ఎందుకీ మూగ రోదన .. మూగ వేదన…అసంతృప్తి..?
• జీవితంలో ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి మార్గాలేమిటో ఆలోచనచేయాలి.
• బిఆర్ఎస్ పార్టీ ఆలోచనపరులను ఏకం చేస్తున్నది.
• వ్యక్తులు కాదు వ్యవస్థీకృతంగా పనులు జరగాలి
• మొత్తం వ్యవస్థకు పనికి వచ్చే పనులకు రూపకల్పన జరిగి, వాటి ఫలితాలు దేశ ప్రజల అనుభవంలోకి రావాలి.