365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,సెప్టెంబర్ 13, 2023: భారత స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. ఆసియా, గ్లోబల్ మార్కెట్లలో బలహీనత ఆవరించినప్పటికీ స్థానిక సూచీలు లాభాల్లో ముగిశాయి.
ఆగస్టు పీసీఐ గణాంకాలు మెరుగ్గా నమోదవ్వడం, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెంచడం ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపింది. మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లూ కోలుకున్నాయి.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 76, బీఎస్ఈ సెన్సెక్స్ 245 పాయింట్లు పెరిగాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు నిఫ్టీకి అండగా నిలిచాయి. పీఎస్యూ బ్యాంకు సూచీ రికార్డు స్థాయిలో ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలహీనపడి 82.99 వద్ద స్థిరపడింది.
హాంకాంగ్, సింగపూర్, జపాన్, కొరియా, చైనా ఇండెక్స్లు పతనమయ్యాయి. యూకే ఎకానమీ కుంచించుకుపోవడం, క్రూడాయిల్ ధరల పెరుగుదల అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితికి కారణమవుతోంది.
క్రితం సెషన్లో 67,221 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 67,188 వద్ద మొదలైంది. 67,053 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,565 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 245 పాయింట్ల లాభంతో 67,466 వద్ద ముగిసింది.
19,989 వద్ద ఓపెనైన ఎన్ఎస్ఈ నిఫ్టీ 19,944 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,096 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొని మొత్తంగా 76 పాయింట్లు పెరిగి 20,070 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 398 పాయింట్ల లాభంతో 45,909 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 31:19గా ఉంది. కోల్ ఇండియా (3.21%), గ్రాసిమ్ (3.13%), టాటా మోటార్స్ (2.92%), భారతీ ఎయిర్ టెల్ (2.76%), టైటాన్ (2.36%) టాప్ గెయినర్స్. ఎల్టీ (1.09%), అదానీ పోర్ట్స్ (1.33%), హెచ్డీఎఫ్సీ లైఫ్ (1.47%), ఎల్టీ (1.09%), సిప్లా (1.04%) టాప్ లాసర్స్. ఆటో, ఐటీ రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ కొనసాగుతోంది.
బ్యాంకు, మీడియా, మెటల్, ఫార్మా, ప్రైవేటు బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు లాభపడ్డాయి. పీఎస్యూ బ్యాంక్ సూచీ ఏకంగా 4.3 శాతం పెరగడం గమనార్హం.
పీఎన్బీ, ఐవోబీ, సెంట్రల్ బ్యాంక్ షేర్లు ఏకంగా 7-9 శాతం ఎగిశాయి. పీఎస్బీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, మహా బ్యాంక్, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా 3-7 శాతం వరకు పెరిగాయి.
సెప్టెంబర్ నిఫ్టీ ఛార్ట్ను పరిశీలిస్తే 20150 వద్ద రెసిస్టెన్సీ, 20080 వద్ద సపోర్ట్ ఉన్నాయి. ఇన్వెస్టర్లు స్వల్పకాలంలో ఐటీసీ, ఐవోబీ, పీఎన్బీ, సనోఫి ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, కొటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేయొచ్చు.
కాఫీడే ఎంటర్ప్రైజెస్ యూనిట్ దివాలా ప్రక్రియను ఎన్సీఎల్ఏటీ నిలిపివేసింది. ఐటీఐ షేర్లు చివరి మూడు సెషన్లలోనే 56 శాతం పెరిగాయి. పీఎన్బీలో 15 లక్షల షేర్లు చేతులు మారాయి.
టైటాన్ షేరు 2.6 శాతం పెరిగి జీవిత కాల గరిష్ఠాన్ని అందుకుంది. మూడు రోజుల వరుస నష్టాల నుంచి అతుల్ ఆటో కోలుకుంది.
ఎన్ఐఐటీ షేర్లు 18 శాతం ఎగిశాయి. అజంతా ఫార్మా, అరబిందో ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, గ్రాసిమ్, జీఎస్కే ఫార్మా, జేబీ కెమికల్స్ పీఎన్బీ షేర్లు ఇంట్రాడేలో 52 వారాల గరిష్ఠాన్ని అందుకున్నాయి. రూ.2470 కోట్ల విలువైన ఆర్డర్ రావడంతో జీఎంర్ పవర్ షేర్లు 10 శాతం పెరిగాయి.
- మూర్తి నాయుడు పాదం
నిఫ్ట్ మాస్టర్
స్టాక్ మార్కెట్ అనలిస్ట్
+91 988 555 9709.