365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,న్యూస్,తిరుపతి, డిసెంబరు 13, 2023 :టీటీడీ స్థానికాల‌యాల్లో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ‌హించ‌ను న్నారు. డిసెంబరు 16వ తేదీ రాత్రి 12.34 గంట‌ల‌కు ధనుర్మాసం ప్రారంభమవుతుంది.

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబ‌రు 17 నుంచి జ‌న‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు ప్ర‌తిరోజూ ఉదయం 4 నుంచి 6 గంటల వరకు సుప్ర‌భాతం స్థానంలో ఏకాంతంగా తిరుప్పావై పారాయ‌ణం, భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు.

ఈ కార‌ణంగా సుప్ర‌భాతం సేవా టికెట్లు జారీ చేయ‌రు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో…

తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

మొద‌టిరోజైన డిసెంబ‌రు 17న సాయంత్రం ధ‌నుర్మాసం గంట కార‌ణంగా స‌హ‌స్ర‌దీపాలంకార సేవ ర‌ద్ద‌యింది. ఆల‌యంలో నెల రోజుల పాటు ఉద‌యం 4.30 నుంచి 6 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాసం గంట‌, ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

అదేవిధంగా, తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఉద‌యం 4 నుండి 5.30 గంట‌ల వ‌ర‌కు సుప్ర‌భాతం స్థానంలో తిరుప్పావై పారాయ‌ణం, భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.

తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యంలో ఉద‌యం 4 నుంచి 5 గంట‌ల వ‌ర‌కు ధ‌నుర్మాస కైంక‌ర్యాలు, ఉద‌యం 5.30 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు భ‌క్తుల‌కు ధ‌నుర్మాస ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు.