
365తెలుగు డాట్ కామ్ ఆన్లైన్ న్యూస్,తిరుమల,డిసెంబర్ 28,2021:సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం విశేషంగా ఏర్పాట్లు చేపట్టామని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలో 5 ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటుచేసి రోజుకు 5 వేలు చొప్పున మొత్తం 50 వేల టోకెన్లు కేటాయిస్తామని, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో స్థానిక భక్తులకు మాత్రమే ఈ టోకెన్లు మంజూరుచేస్తామని చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు కోవిడ్ లక్షణాలు ఉంటే ఇతర భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణం వాయిదా వేసుకోవాలని కోరారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో అదనపు ఈఓ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
గదులు
తిరుమలలో యాత్రికులు బస చేసేందుకు దాదాపు 7500 పైగా గదులు ఉండగా ప్రస్తుతం 1300 పైగా గదుల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. ఈ కారణంగా భక్తులు వీలైనంత వరకు తిరుపతిలోనే గదులు పొందాలని కోరడమైనది.
రిసెప్షన్ -1పరిధిలోనివి
ఎంబిసి ఏరియాలో గదుల సంఖ్య – 683
ప్రస్తుతం కేటాయిస్తున్నవి – 516(167 గదులు రిపేర్లో ఉన్నాయి)
పద్మావతి ఏరియాలో గదుల సంఖ్య – 670
ప్రస్తుతం కేటాయిస్తున్నవి – 487(183 గదులు రిపేర్లో ఉన్నాయి)
రిసెప్షన్ -2, 3 పరిధిలోనివి
మొత్తం గదుల సంఖ్య – 6,285
ప్రస్తుతం కేటాయిస్తున్నవి – 4,814
రిపేర్లో ఉన్నవి – 1260
ఇతర వివరాలు
– జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు తిరుమలలో వసతి గదుల ఆడ్వాన్స్ రిజర్వేషన్ను రద్దు చేసి, కరెంట్ బుకింగ్లో భక్తులకు కేటాయించడం జరుగుతుంది.
– ఎమ్బిసి – 34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టిబిసి కౌంటర్, ఎఆర్పి కౌంటర్లలో జనవరి 11వ తేదీ తెల్లవారుజామున 12 గంటల నుంచి 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయించబడవు.
– జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు.
– శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకటకళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవిందసాయి విశ్రాంతి గృహాల్లో కౌంటర్లు ఏర్పాటుచేసి దర్శన టికెట్లు, గదులు కేటాయిస్తారు.
– సామాన్య భక్తులకు తిరుమలలో 6 ప్రాంతాలలో ఉన్న రిజిస్ట్రేషన్ కౌంటర్ల ద్వారా గదులు మంజూరు చేస్తారు.

శ్రీవారి ఆలయం
– సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జనవరి 1న, వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 13నుంచి 22వ తేదీ వరకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది.
– సిఫార్సు లేఖలు స్వీకరించబడవు.
– జనవరి 13న వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో జనవరి 11న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.
– వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
– వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5 నుంచి 6 గంటల వరకు చక్రస్నానం ఏకాంతంగా నిర్వహిస్తారు.
– లడ్డూ కాంప్లెక్సులో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా 5 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉంచడం జరుగుతుంది.
జనవరి 1న సమాచార కేంద్రాల్లో భక్తులకు లడ్డూలు విక్రయం
– చెన్నైలోని సమాచార కేంద్రానికి 30 వేల చిన్నలడ్డూలు, 500 పెద్ద లడ్డూలు, 75 వేల చిన్నలడ్డూలు(రూ.7/-), బెంగళూరులోని సమాచార కేంద్రానికి 10 వేల చిన్నలడ్డూలు, 100 పెద్ద లడ్డూలు, హైదరాబాద్లోని సమాచార కేంద్రానికి 10 వేల చిన్నలడ్డూలు, వేలూరులోని సమాచార కేంద్రానికి 5 వేల చిన్నలడ్డూలు, 100 పెద్ద లడ్డూలు, ఒంటిమిట్ట, వేలూరులోని సమాచార కేంద్రాలకు కలిపి 7 వేల చిన్నలడ్డూలను భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచుతారు.
ఆరోగ్య విభాగం
– కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు శ్రీవారి ఆలయంలో ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ ఏర్పాటు.
– అలిపిరి చెక్ పాయింట్, తిరుమలలోని గదుల కేటాయింపు కేంద్రాలు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం,లడ్డూ కౌంటర్ల వద్ద కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శానిటైజేషన్ జరుగుతుంది.

కల్యాణకట్ట
– తలనీలాలు తీసేందుకు తగినంత మంది క్షురకులను అందుబాటులో ఉంచడం జరిగింది. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ క్షురకులు పిపిఇ కిట్లు, ఆప్రాన్లు ధరించి భక్తులకు సేవలందిస్తారు.
అన్నప్రసాదం
– అన్నప్రసాద భవనంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఈ 10 రోజుల పాటు ఉదయం 4 నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది.
వైద్యం
– అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో వైద్యసేవలందించేందుకు వైద్యబృందాల ఏర్పాటు.
శ్రీవారి సేవ
– అన్ని విభాగాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందిస్తారు.
పార్కింగ్
– తిరుమలలో పోలీసులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు.

భక్తులు తప్పకుండా పాటించాల్సిన కోవిడ్ నిబంధనలు
– కోవిడ్ – 19 మూడవ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.
– భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలి.
– భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. తరచూ శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి.
– టిటిడి ఉద్యోగులు, వేలాది మంది సహ భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులు టిటిడి విజిలెన్స్ మరియు సెక్యూరిటి సిబ్బందికి సహకరించాలని కోరడమైనది.
ఇదివరకే ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన దర్శన టికెట్ల వివరాలు
రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు :
– జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు – రోజుకు 20 వేలు,
– జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు, 23నుంచి 31వ తేదీ వరకు – రోజుకు 12 వేలు
స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు :
– జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో రోజుకు 5 వేలు
– మిగిలిన రోజుల్లో – రోజుకు 10 వేలు
– ఆఫ్లైన్లో రోజుకు 5 వేలు చొప్పున తిరుపతిలో కౌంటర్ల ద్వారా స్థానిక భక్తులకు కేటాయింపు.

శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు :
– జనవరి 1న – 1000 బ్రేక్ దర్శన టికెట్లు
– జనవరి 13న వైకుంఠ ఏకాదశి నాడు – 1000 మహాలఘు దర్శన టికెట్లు
– జనవరి 14 నుంచి 22వ తేదీ వరకు 9 రోజుల పాటు – రోజుకు 2 వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు
వర్చువల్ సేవలు :
– జనవరి మాసానికి రోజుకు 5,500 టికెట్లు చొప్పున జారీ.