365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుపతి,ఫిబ్రవరి 21,2022: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.
అంకురార్పణం సందర్భంగా సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు మూషిక వాహనంపై శ్రీ వినాయకస్వామివారికి ఆస్థానం నిర్వహించారు. ఆ తరువాత సాయంత్ర 6.30 నుంచి అంకురార్పణ కార్యక్రమం జరిగింది.
ఫిబ్రవరి 22న ధ్వజారోహణం :
ఫిబ్రవరి 22 వ తేదీ ఉదయం 8.10 గంటలకు మీన లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పల్లకీ ఉత్సవం, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు హంస వాహనం ఆస్థానం జరుగనున్నాయి.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.