Vijayapriya Nityananda

365తెలుగుడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మర్చి 4,2023:మూడు రోజుల నుంచి ఐక్యరాజ్యసమితి ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఒక మహిళ నుదిటిన కుంకుమ, మెడలో రుద్రాక్ష జపమాల ధరించి, సాధ్విలా కనిపిస్తుంది. ఈ మహిళ మరెవరో కాదు భారతదేశానికి చెందిన పరారీ నిత్యానంద శిష్యురాలు.

నిత్యానందపై భారత్‌లో అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి నుంచి తప్పించుకున్న నిత్యానంద అమెరికా దేశమైన ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి ‘హిందూ దేశం’గా ప్రకటించాడు. ఈ దేశానికి ‘యునైటెడ్ నేషన్ కైలాస’ అని పేరు పెట్టారు.

ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ ఫొటోలో ఉన్నది నిత్యానంద శిష్యురాలు పేరు విజయప్రియ నిత్యానంద. ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో విజయప్రియ కైలాస శాశ్వత ప్రతినిధి అని గతంలో పేర్కొన్నారు. ఇంతకీ ఆ విజయప్రియ ఎవరో తెలుసుకుందామా? కైలాస దేశానికి ఐక్యరాజ్యసమితి నిజంగా గుర్తింపు ఇచ్చిందా?

ముందుగా నిత్యానంద ఎవరో తెలుసా?

Vijayapriya Nityananda

విజయప్రియ నిత్యానంద గురించి తెలుసుకునే ముందు నిత్యానందను గురించి కూడా తెలుసుకోవాలి. నిత్యానంద అసలు పేరు రాజశేఖరుడు. అది తనకు భగవంతుడు అతనికి నిత్యానంద అనే హోదాను కల్పించినట్లు చెబుతాడు. ఆయన తమిళనాడులోని తిరునామలైకి చెందినవాడు.

నిత్యానందపై అత్యాచారం, పిల్లల కిడ్నాప్‌లతోపాటు పలు కేసులు నమోదయ్యాయి. 2019లో నిత్యానంద దేశం విడిచి పారిపోయి అమెరికా దేశమైన ఈక్వెడార్‌కు సమీపంలో ఓ దీవిని కొనుగోలు చేసి ప్రత్యేక దేశంగా ప్రకటించారు నిత్యానంద.

ఈ దేశానికి ‘యునైటెడ్ నేషన్ కైలాస’ అని పేరు పెట్టారు. కైలాసాన్ని హిందువుల దేశమని నిత్యానంద అన్నారు.

విజయప్రియ నిత్యానంద ప్రకటన కారణంగా ఆమె వెలుగులోకి వచ్చింది..

రెండు రోజుల క్రితం, జెనీవాలోని ఐక్యరాజ్యసమితి (UN)లో జరిగిన సమావేశంలో, విజయప్రియ నిత్యానంద, ఆమె సహచరులు చాలా మంది కాషాయ బట్టలు ధరించి కనిపించారు. ఈ సందర్భంగా విజయప్రియ భారత్‌పై తీవ్ర స్థాయిలో విషం చిమ్మింది.

ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులపై ఐక్యరాజ్యసమితి కమిటీ (CESCR) నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విజయప్రియ మాట్లాడుతూ “హిందూ మతానికి చెందిన సుప్రీం బిషప్”కి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.

హిందూ మతంలోని ప్రాచీన సంప్రదాయాలను పునరుద్ధరించినందుకు నిత్యానందను ఆయన పుట్టిన దేశంలో వేధింపులకు గురిచేస్తున్నారని, నిషేధించారని అన్నారు.

విజయప్రియ నిత్యానంద ఎవరు..?

చీర, తలపాగా ధరించి, ఆభరణాలతో అలంకరించుకున్న విజయప్రియ నిత్యానంద ఐక్యరాజ్యసమితి సమావేశంలో తనను తాను ‘యునైటెడ్ స్టేట్స్‌లో కైలాస శాశ్వత రాయబారి’గా పరిచయం చేసుకుంది. అయితే, విజయప్రియ ఎన్జీవోగా ఈ కార్యక్రమంలో పాల్గొందని తర్వాత ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.

Vijayapriya Nityananda

ఐక్యరాజ్యసమితి జెనీవాలో తన రెండు కార్యక్రమాలలో నిత్యానంద కల్పిత దేశం ప్రతినిధి విజయప్రియ నిత్యానంద మాట్లాడిన మాటలు సరైనవి కావని తెలిపింది. సమావేశంలో చర్చిస్తున్న అంశాలకు, ఆమె ప్రసంగానికి సంబంధం లేదని ఐరాస అధికారి ఒకరు తెలిపారు.

విజయప్రియ నిత్యానంద ఫేస్‌బుక్ ప్రొఫైల్ ప్రకారం ఆమె వాషింగ్టన్‌లో నివసిస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేసిన వారి చిత్రాలలో విజయప్రియ కుడి చేతిపై నిత్యానంద పెద్ద పచ్చబొట్టు చూడవచ్చు.

విజయప్రియ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఆమె యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా నుంచి మైక్రోబయాలజీలో BSc ఆనర్స్ చేసినట్లు ఉంది. ఆమె జూన్ 2014లో యూనివర్శిటీ డీన్ గౌరవ జాబితాలో చేర్చబడింది.

విజయప్రియకు ఇంగ్లీష్, ఫ్రెంచ్, హిందీ, క్రియోల్ , పిడ్జిన్ (ఫ్రెంచ్) అనే నాలుగు భాషలు తెలుసునని లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ పేర్కొంది.

ఆ తర్వాత విజయప్రియ కూడా తన ప్రకటనపై క్లారిటీ ఇచ్చింది.భారత్‌పై చేసిన ప్రకటనపై నిరసన ప్రారంభమైనప్పుడు, మొదట ఐక్యరాజ్యసమితి సంస్థ, ఆపై విజయప్రియ స్వయంగా వివరణ ఇచ్చారు.

విజయప్రియ ఓ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని చెప్పింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస భారతదేశానికి ఎంతో గౌరవం ఇస్తుందని, భారతదేశాన్ని తన గురుపీఠంగా పరిగణిస్తుందని అన్నారు.

Vijayapriya Nityananda

నిత్యానంద దేశాన్ని ఐరాస నిజంగా గుర్తించిందా.. ?

ఈ విషయం తెలుసుకోవడానికి ఐక్యరాజ్య వెబ్‌సైట్‌ని తనిఖీ చేస్తే ఇందులో కైలాస ప్రస్తావన లేదు. విజయప్రియ ప్రకటనపై వివాదం చెలరేగినప్పుడు ఐక్యరాజ్యసమితి కూడా విడుదల చేసిన ప్రకటనలో కైలాసాన్ని ‘కల్పిత దేశం’గా సంబోధించింది.

కైలాసానికి ఐక్యరాజ్యసమితి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదని, అలాగే విజయప్రియకు ఐరాసలో శాశ్వత ప్రతినిధి హోదా కూడా ఇవ్వలేదని స్పష్టమవుతోంది.