
తిరుమలలో ముగిసిన యుద్ధకాండ పారాయణం

365తెలుగు డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,తిరుమల,జూలై 10,2021:లోక కల్యాణార్థం,కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలో 30 రోజుల పాటు నిర్వహించిన యుద్ధకాండ పరాయణం శనివారం మహా పూర్ణాహుతితో ముగిసిందని టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంలో అదనపు ఈవో దంపతులు పాల్గొన్నారు. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని ఆధ్వర్యంలో వసంత మండపంలో యుద్ధకాంలోని శ్లోకాల పారాయణం, ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జప-తర్పణ-హోమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సంక్షేమం కొరకు ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో జూలై 10 నుంచి 16వ తేదీ వరకు శ్రౌత యాగాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 24వ తేదీ నుంచి నెల రోజుల పాటు భక్తుల సకల కార్య సిద్ధి, కోరిన కోర్కెలు నెరవేరేందుకు రామాయణంలోని కొన్ని ఘట్టాలు పారాయణం చేయనున్నట్లు చెప్పారు. ఇందులో విద్య, వివాహం, సంతానం, ఉద్యోగం, ఆరోగ్యం, పేరు ప్రతిష్టలు, ధన ప్రాప్తి, కార్యజయం తదితరమైన భక్తుల కోర్కెలు నెరవేరేందుకు పఠించవలసిన శ్లోకాలు వసంతమండపంలో,జప-తర్పణ-హోమాలు ధర్మగిరి విజ్ఞానపీఠంలో నిర్వహిస్తారని తెలిపారు. త్వరలో యోగ శాస్త్రం, చాణక్యుడు రచించిన అర్థశాస్త్రం, మనుస్మృతి వంటి గ్రంథాల్లోని ప్రతి శ్లోకానికి అర్థ-తాత్పర్యాలతో పారాయణం చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా తిరుమలలో అష్టాదశ పురాణాల పారాయణంలో జరుగుతుందని, ప్రస్తుతం మత్స్యపురాణం పారాయణం చేస్తున్నారని చెప్పారు. అనంతరం భాగవత పురాణం, గరుడ పురాణం కూడా అత్యద్భుతంగా పారాయణం చేయనున్నట్లు వివరించారు. మన పూర్వీకులు మనకు అందించిన ఈ విజ్ఞాన సంపదను మన పిల్లలకు అందివ్వాలన్నారు.అంతకుముందు అదనపు ఈవో, తిరుపతి యం.ఎల్.ఏ.శ్రీ బి.కరుణాకర్ రెడ్డితో కలిసి 32 మంది ఉపాసకులను సన్మానించి, వస్త్ర బహుమానం, శ్రీవారి ప్రసాదం అందజేశారు.


ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో
ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలోని ప్రార్థనా మందిరంలో ప్రతి రోజు యుద్ధకాండ పరాయణంలో భాగంగా కరోనా వ్యాధి వ్యాప్తి నివారణకు విశేష మంత్రాలతో జప-తర్పణ-హోమాదులు నిర్వహించారు. లోక క్షేమం కోసం 30 రోజుల పాటు ఉపాసకులు అకుంఠిత దీక్ష, శ్రద్ధలతో శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయస్వామి సమేత శ్రీ రామ మూల మంత్రానుష్ఠానం 30 లక్షల సార్లు జపించారు. జపంలో పదవ వంతు ఆవు పాలతో తర్పణం, తర్పణంలో 10వ వంతు హోమాలు నిర్వహించారు. ఇందులో వాస్తుహోమం, చతుషష్ఠి యోగిని మండపం, క్షేత్ర పాలక మండపం, నవగ్రహ మండలం, శ్రీరామ దశావరణ యంత్ర పూజ, షోడశ రామలింగతో భద్ర మండల పూజ, రామ చతురాయతన కలశ పూజ, మంత్ర పుష్పం, దర్భార్ సేవ నిర్వహించారు.మహా పూర్ణాహూతి సందర్బంగా శనివారం ఉదయం మూల మంత్ర హోమాలు, శ్లోక హోమాలు, మండప దేవత హోమాలు, అంగ హోమాలు, పౌష్ఠిక హోమాలు, శాంతి హోమాలు, జయాతి హోమం, కుంభారాధన జరిగింది.తరువాత సమస్త దోషాలు తోలగి పోవాలని అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సంకల్పం, హోమద్రవ్య పూజ, బలి ప్రదానం, ద్రవ్య సమర్పణ, వసోర్ధారా హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది.


వసంత మండపంలో :
అంతకుముందు తిరుమల వసంత మండపంలో కార్యక్రమం ప్రారంభంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్టాడుతూ వేద పారాయణం చేస్తే ఎంత ఫలం లభిస్తుందో, రామాయణంలోని యుద్ధకాండ పారాయణం చేయడం వలన అంతటి ఫలితం కలుగుతుందని తెలిపారు. యుద్ధకాండ పారాయణం వలన అంతః శత్రువులు, బాహ్య శత్రువులు నశిస్తారన్నారు. మానవ జీవితంలో వచ్చే గ్రహల దశలు, అంతర్ దశల్లో కలగే చెడు ఫలితాలు తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరు 40 రోజుల పాటు యుద్ధకాండలోని ఏ సర్గ నుండి ఏ సర్గ వరకు పరాయణం చేస్తే ఏ గ్రహ దోషాలు తోలగిపోతాయనే విషయం వివరించారు.చివరి రోజున యుద్ధకాండలోని 128 నుంచి 131వ సర్గ వరకు ఉన్న 288 శ్లోకాలు, బాల కాండ ప్రథమ సర్గ, యోగవాశిష్ఠంలోని విషూచిక మహామంత్రంలోని 100 శ్లోకాలు కలిపి మొత్తం 388 శ్లోకాలను పఠించినట్లు చెప్పారు. ” సకృదేవ ప్రపన్నాయత వాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యే తద్వ్రతం మమ ” అనే మహామంత్రం ప్రకారం యుద్ధకాండలోని మొత్తం 131 సర్గలలో 5783 శ్లోకాలను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయణం చేశారన్నారు.


ప్రత్యేక ఆకర్షణగా శ్రీరామ పట్టాభిషేకం :
వసంత మండపంలో శ్రీరామ పట్టాభిషేకం సందర్బంగా సర్వభూపాల వాహనంపై సీతారామ సమేత లక్ష్మణ స్వామివారు, ఆంజనేయస్వామివారు, విభీషణుడు తదితర పరివార దేవతల విగ్రహలు విశేషంగా ఆకర్షిచాయి.కాగా, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి లావణ్య, శ్రీమతి తేజోవతి, శ్రీమతి లక్ష్మీరాజ్యం బృందం ” శ్రీ రాముని చరితమును తెలిపెదమమ్మా
ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా …,” సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.